
నవంబరు నుంచి అమల్లోకి రానున్న బ్యాకింగ్ నియమాల (సవరణ) చట్టం- 2025
బ్యాంకింగ్ నియమాల (సవరణ) చట్టం-2025 కింద నామినేషన్కు సంబంధించి కీలక నిబంధనలు 2025 నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ చట్టాన్ని 2025 ఏప్రిల్ 15న అధికారికంగా ప్రకటించారు (గెజిట్ నోటిఫికేషన్ లింక్ను కింద చూడొచ్చు). ఇందులో అయిదు చట్టాల్లో మొత్తం 19 సవరణలున్నాయి – భారత రిజర్వు బ్యాంకు చట్టం- 1934, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం- 1949, భారతీయ స్టేట్ బ్యాంకు చట్టం- 1955, బ్యాంకింగ్ కంపెనీల (సంస్థల స్వాధీనం, బదిలీ) చట్టం- 1970, 1980.
బ్యాంకింగ్ నియమాల (సవరణ) చట్టం- 2025 నిబంధనలు ‘‘కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించిన తేదీ నుంచి అమల్లోకి వస్తాయి’’. అలాగే చట్టంలోని వివిధ నిబంధనల కోసం వేర్వేరు తేదీలనూ నిర్ణయించవచ్చని నోటిఫికేషన్ పేర్కొంది.
తదనుగుణంగా బ్యాంకింగ్ నియమాల (సవరణ) చట్టం- 2025లోని సెక్షన్లు 10, 11, 12, 13లోని నిబంధనలు 2025 నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కింద ఇచ్చిన లింకులో దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ అందుబాటులో ఉంది.
ఇప్పుడు సెక్షన్ 10, 11, 12, 13 ద్వారా 2025 నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తున్న నిబంధనలు డిపాజిట్ ఖాతాలు, సురక్షిత పర్యవేక్షణలో ఉంచిన వస్తువులు, బ్యాంకుల సేఫ్టీ లాకర్లలోని అంశాలపై నామినేషన్ సదుపాయానికి సంబంధించినవి.
ఈ నిబంధనల్లోని ముఖ్యాంశాలు:
• ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు: వినియోగదారులు ఒకేసారి లేదా వరస క్రమంలో నలుగురు వ్యక్తులను నామినేట్ చేయవచ్చు. దాంతో డిపాజిటర్లు, వారి నామినీలకు క్లెయిముల పరిష్కారం సులభతరమవుతుంది.
• డిపాజిట్ ఖాతాల కోసం నామినేషన్: డిపాజిటర్లు వారి ప్రాధాన్యాన్ని బట్టి ఒకేసారి లేదా వరుస క్రమంలో నామినేషన్లను ఎంపిక చేసుకోవచ్చు.
• సురక్షిత పర్యవేక్షణలో, సేఫ్టీ లాకర్లలో ఉన్న వస్తువులకు నామినేషన్: ఈ విధమైన సదుపాయం కోసం ప్రాధాన్య క్రమంలో వరుస నామినేషన్లకు మాత్రమే అవకాశం ఉంది.
• ఒకేసారి నామినేషన్: డిపాజిటర్లు నలుగురు వ్యక్తుల వరకు నామినేట్ చేయడంతోపాటు ఆ వస్తువులు/ అంశాలపై ప్రతి నామినీ వాటా లేదా శాతాన్ని పేర్కొనవచ్చు (మొత్తం 100 శాతంగా ఉండాలి). తద్వారా దానిని నామినీలందరికీ పారదర్శకంగా పంపిణీ చేయగల అవకాశం ఉంటుంది.
• వరుస క్రమంలో నామినేషన్: డిపాజిట్లను, సురక్షిత పర్యవేక్షణలో లేదా లాకర్లలో వస్తువులను నిర్వహిస్తున్న వ్యక్తులు నలుగురు నామినీల వరకు ఎంపిక చేసుకోవచ్చు. దీని ప్రకారం ప్రాధాన్య క్రమంలో మొదటి స్థానంలో ఉన్న నామినీ మరణిస్తే మాత్రమే తర్వాతి స్థానంలో ఉన్న నామినీ అర్హత పొందుతారు. ఇది సెటిల్మెంటులో కొనసాగింపును, వారసత్వ స్పష్టతను అందిస్తుంది.
ఈ నిబంధనల అమలు వల్ల డిపాజిటర్లకు వారి ప్రాధాన్యానుసారం నామినేషన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటును అందిస్తుంది. దీంతో బ్యాంకింగ్ వ్యవస్థలో క్లెయిముల పరిష్కారంలో ఏకరూపత, పారదర్శకత, సమర్థతకు భరోసా లభిస్తుంది.
వివిధ నామినేషన్ల ఎంపిక, రద్దు, లేదా ప్రకటనకు సంబంధించి విధానం, నిర్ణీత పద్ధతులను వివరించే బ్యాంకింగ్ కంపెనీల (నామినేషన్) నియమాలు- 2025ను తగిన సమయంలో ప్రచురిస్తారు. తద్వారా అన్ని బ్యాంకుల్లోనూ ఈ నిబంధనలను ఒకే విధంగా అమలు చేయడానికి అవకాశం లభిస్తుంది.
ఈ సవరణ చట్టంలోని పలు నిబంధనలు (సెక్షన్లు 3, 4, 5, 15, 16, 17, 18, 19, 20) అమల్లోకి వచ్చిన తేదీగా ఆగస్టు 1ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2025 జూలై 29న గెజిట్ నోటిఫికేషన్ ఎస్వో 3494 (ఇ) జారీ చేసింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కింది లింకులో అందుబాటులో ఉంది.
వీటితోపాటు బ్యాంకింగ్ రంగంలో నిర్వహణ ప్రమాణాలను బలోపేతం చేయడం, భారత రిజర్వ్ బ్యాంకుకు బ్యాంకుల నివేదనల్లో ఏకరూపత, డిపాజిటరూ ఇన్వెస్టర్లకు రక్షణను మెరుగుపరచడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆడిట్ నాణ్యతను మెరుగుపరచడం, నామినేషన్ సౌకర్యాన్ని మెరుగుపరచడం ద్వారా వినియోగదారులకు సౌలభ్యాన్ని ప్రోత్సహించడం బ్యాంకింగ్ నియమాల (సవరణ) చట్టం- 2025 లక్ష్యం. సహకార బ్యాంకుల్లో చైర్మన్, పూర్తికాల డైరెక్టర్లు కాని డైరెక్టర్ల పదవీకాలాన్ని హేతుబద్ధీకరించడానికి కూడా ఈ చట్టం వీలు కల్పిస్తుంది.
