
నెలరోజుల్లో రోడ్ల మరమ్మతులు పూర్తవ్వాలి
కర్ణాటకలో రోడ్లు దెబ్బతినడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై ప్రజలు తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నారు. ఇటీవల పలు కాలనీవాసులు రోడ్లపై గుంతలు ఉండడంతో రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజాగా అధ్వాన్నమైన రోడ్లపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. నెల రోజుల్లోపు రోడ్లన్నీ సరి చేయాలని, ట్రాఫిక్ ను క్రమబద్దీకరించాలని అధికారులకు డెడ్ లైన్ విధించారు. లేకుంటే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన రోడ్డు సౌకర్యాలను కల్పించాలని, ఆ విషయంలో రాజీపడొద్దని అధికారులకు సూచించారు.
నగరం నుంచి వీడతామన్న బ్లాక్ బక్
రాజధానిలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండటం, దెబ్బతిన్న రహదారులతో నిత్యం నరకయాతన అనుభవిస్తుండటంతో నగరాన్ని విడిచి వెళతామని, తమ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలిస్తామని ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ బ్లాక్ బక్ ప్రకటించింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నగరమంతా దుమ్ముతో నిండిపోతున్నా, ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని దుమ్మెత్తిపోశారు. దీంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. సీఎం సిద్ధరామయ్య ఎందుకు రోడ్లను బాగుపరచడం లేదని అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అస్తవ్యస్త ట్రాఫిక్, దారుణమైన రోడ్లు
సాప్ట్వేర్ హబ్ గా పేరొందిన బెంగుళూరులో అస్తవ్యస్తమైన ట్రాఫిక్, దారుణమైన రోడ్లు ప్రజలను నిత్యం ప్రమాదాలబారిన పడేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు సరైన సమయంలో ఆఫీస్ లకు చేరుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. దీంతో ఉద్యోగుల ఇబ్బందులు తదితర కారణాలతో బ్లాక్ బక్ సంస్థ నగరం నుంచి కార్యాలయాన్ని తరలించడానికి పూనుకుంది. దీంతో ప్రముఖ పారిశ్రామిక వేత్తలైన కిరణ్ మజుందార్ షా, మోహన్ దాస్ పాయ్ తదితరులు ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీంతో డీకే శివకుమార్ ఎవరూ నగరం విడిచి పోవాల్సిన అవసరం లేదు. త్వరలోనే రోడ్ల అభివృద్ధి యుద్ద ప్రాతిపదికన జరుగుతుందని వివరించారు.
