
నేడు భారత్, ఒమన్ పోరు
ఆసియా కప్ 2025లో భాగంగా నేడు భారత్, ఒమన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరగనుంది. కాగా ఇప్పటికే ఒమన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. టీమిండియా గ్రూప్-ఏలో తమ తొలి రెండు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు చివరి లీగ్ మ్యాచ్లో ఒమన్తో తలపడనుంది.
బ్యాటింగ్పై దృష్టి
భారత జట్టు ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్లలో తమ బ్యాటింగ్ను పూర్తి స్థాయిలో చూపించడానికి అవకాశం దొరకలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)తో జరిగిన తొలి మ్యాచ్లో బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో భారత జట్టు కేవలం 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కాబట్టి టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయారు. అలాగే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా బ్యాటర్లు పూర్తిస్థాయిలో ఆడలేదు. ఆ మ్యాచ్లో పాకిస్థాన్ 146 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ కేవలం 17.5 ఓవర్లలోనే గెలిచింది. దీంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లకు, ఫినిషర్లకు ఎక్కువసేపు క్రీజులో నిలిచి ఆడే అవకాశం రాలేదు.
బౌలింగ్లో మార్పులు?
భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. కానీ, జట్టు మేనేజ్మెంట్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తోంది. ఒకవేళ అలా జరిగితే, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఈ టోర్నమెంట్లో తన మొదటి మ్యాచ్ ఆడతాడు. మరో ఆప్షన్గా హర్షిత్ రాణాకు కూడా అవకాశం దక్కవచ్చు. అయితే బుమ్రా తన ఫామ్ను కొనసాగించాలని, అందుకోసం మ్యాచ్ ఆడాలని కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రాకు విశ్రాంతినిస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
వరుస పరాజయాల్లో ఒమన్
ఇప్పటికే ఒమన్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. పాకిస్తాన్, యుఏఈ చేతిలో ఓటమితో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్లో భారత్కు గట్టి పోటీని ఇచ్చి, టోర్నమెంట్ను మంచి ముగింపుతో పూర్తి చేయాలని చూస్తోంది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచ్లలో వారి బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 67 పరుగులు, అలాగే యూఏఈతో జరిగిన మ్యాచ్లో 130 పరుగులు మాత్రమే చేసి వారి బ్యాటింగ్ బలహీనతను చూపించారు. వారి ఏ ఒక్క బ్యాటర్ కూడా 30 పరుగులు చేయలేదు. ఒమన్ బ్యాటర్లు హమ్మద్ మీర్జా, ఆర్యన్ బిష్త్ మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇచ్చారు. ఇప్పుడు భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి వంటి వారికి ఎదుర్కోవడానికి ఒమన్ బ్యాటర్లకు చాలా కష్టమవుతుంది.
పిచ్, వాతావరణం
షేక్ జాయెద్ స్టేడియంలో భారత జట్టు ఈ టోర్నమెంట్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడనుంది. ఆటగాళ్లకు అలసట లేకుండా ఉండేందుకు, టీమ్ ప్రాక్టీస్ చేయకుండా, అదే రోజు ప్రయాణించి మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకుంది. మ్యాచ్ తర్వాత మళ్లీ దుబాయ్కి తిరిగి వెళ్లి, శనివారం విశ్రాంతి తీసుకుని ఆదివారం పాకిస్థాన్తో జరగబోయే ముఖ్యమైన మ్యాచ్కి సిద్ధమవుతోంది. అబుదాబిలో వాతావరణం బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్లో మంచు కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.
ఒమన్ జట్టు: జతిందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సుఫియాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెడేరా, ఆమిర్ కలీమ్, మొహమ్మద్ నదీమ్, సుఫియాన్ మెహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనవాలే, జిక్రియా ఇస్లామ్, హస్నైన్ అలీ షా, ఫైసల్ షా, ముహమ్మద్ ఇమ్రాన్, నదీమ్ ఖాన్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.
మ్యాచ్ ఎక్కడ చూడాలి?
ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలాగే సోనీలివ్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఈ మ్యాచ్ ఫలితం టోర్నమెంట్పై పెద్దగా ప్రభావం చూపకపోయినా, భారత జట్టుకు ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా బ్యాటర్లకు తమ ఫామ్ను తిరిగి పొందడానికి, సూపర్ 4 మ్యాచ్లకు సంపూర్ణంగా సిద్ధం కావడానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ల నుంచి భారీ స్కోర్లు ఆశించవచ్చు.
