
నగర వీధుల నుంచి ఐఐటి కలలకు: పారిశుధ్య కార్మికుల పిల్లలకు ఐఐటీ హైదరాబాద్ సందర్శన సౌభాగ్యం
నగర పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే పారిశుధ్య కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు జీహెచ్ఎంసీ ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పారిశుధ్య కార్మికుల పిల్లల్లో ఉన్నత ఆశయాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో నేడు (జనవరి 31, 2026)న వారికి ఐఐటీ హైదరాబాద్ సందర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది.
జీహెచ్ఎంసీలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ విహార యాత్రలో పాల్గొంటారు. కేవలం ఒక విద్యా సంస్థ సందర్శనగానే కాకుండా, వారిలో ఉన్న మానసిక అడ్డంకులను తొలగించి, నేపథ్యంతో సంబంధం లేకుండా ఎవరైనా గొప్ప కలలు కనవచ్చని నిరూపించడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో పిల్లలు ఐఐటి హైదరాబాద్ ఫ్యాకల్టీ, విద్యార్థులతో మెలిగే అవకాశం పొందుతారు. విద్యా బ్లాక్స్, లైబ్రరీలు, ఇన్నోవేషన్ సెంటర్లను సందర్శించటం ద్వారా వారు ప్రతిభ, ఆవిష్కరణల వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. అంతేకాక, స్వీయ నమ్మకాన్ని పెంపొందించే మోటివేషనల్ సెషన్లు, భవిష్యత్ లక్ష్యాలను సెట్ చేసుకునే మార్గదర్శక శిక్షణలు కూడా అందించబడతాయి. పిల్లల సురక్షిత రవాణా, ఆహారం, మార్గనిర్దేశకుల సపోర్ట్ కూడా జీహెచ్ఎంసీ చూసుకుంటోంది.
కమిషనర్ ఆకాంక్ష
నగరానికి వెన్నెముక లాంటి వారు మన పారిశుధ్య కార్మికులు. వారి పిల్లల కలలు కూడా ఎంతో విలువైనవని, అత్యున్నత శిఖరాలను అందుకోవడం వారికి కూడా సాధ్యమేనని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయాలనుకుంటున్నాం. ఇది వారి ఉజ్వల భవిష్యత్తు కోసం మేము వేస్తున్న ఒక చిన్న కానీ అర్థవంతమైన అడుగు, అని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ పేర్కొన్నారు.
నగర వీధులను శుభ్రం చేసే వారి పిల్లలకు, దేశంలోని అత్యున్నత విద్యాసంస్థల ద్వారా స్ఫూర్తిని అందించడం అనేది జీహెచ్ఎంసీ చూపుతున్న సామాజిక బాధ్యతకు, సమానత్వానికి నిదర్శనం. ఈ చొరవతో పారిశుధ్య కార్మికుల పిల్లల ఆలోచనా దృక్పథంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని భావిస్తున్నారు.
