
నగరంలో 252 భవనాల్లో అగ్నిమాపక భద్రతపై జీహెచ్ఎంసీ తనిఖీలు
హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) టౌన్ ప్లానింగ్ విభాగం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా నగరంలోని ఆరు జోన్ల పరిధిలో మొత్తం 252 భవనాల్లో అగ్నిమాపక భద్రతపై పరిశీలనలు చేపట్టారు.
ఈ తనిఖీలలో ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంట ఉన్న వాణిజ్య సంస్థలు, మాల్స్, వ్యాపార సముదాయాలను లక్ష్యంగా చేసుకున్నారు. భవనాల్లో అగ్నిమాపక భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను అధికారులు పరిశీలించారు. అలాగే ఫైర్ సేఫ్టీ పరికరాల లభ్యత, వాటి నిర్వహణ పరిస్థితి, అత్యవసర నిష్క్రమణ మార్గాలు వంటి అంశాలను సమీక్షించారు.
కొన్ని భవనాల సెల్లార్లలో ప్రమాదకర పదార్థాలను నిల్వ ఉంచినట్టు గుర్తించడంతో వాటిని వెంటనే తొలగించాలని యజమానులకు సూచించారు. అగ్నిమాపక పరికరాలు లేకపోవడం లేదా సరైన విధంగా నిర్వహించకపోవడం వంటి లోపాలు ఉన్న భవనాల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, నగరంలో అగ్నిప్రమాదాల ప్రమాదాన్ని తగ్గించేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. నగరంలో భద్రతా ప్రమాణాలు బలపడేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
