Let's talk: editor@tmv.in
'ధ్వజ్ యాత్ర': కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆర్.ఎస్.ఎస్ భారీ ర్యాలీ

'ధ్వజ్ యాత్ర': కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆర్.ఎస్.ఎస్ భారీ ర్యాలీ

Dantu Vijaya Lakshmi Prasanna
7 ఫిబ్రవరి, 2026

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తన శతాబ్ది ఉత్సవాల వేళ దేశవ్యాప్తంగా భారీ అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంస్థపై ఉన్న వివిధ రకాల అపోహలను తొలగించి, దాని వాస్తవ చరిత్రను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 'ధ్వజ్ యాత్ర' (జెండా ర్యాలీ) శుక్రవారం ప్రారంభమైంది. శ్రీనగర్‌లోని చారిత్రాత్మక లాల్ చౌక్ వద్ద కాషాయ జెండాను ఎగురవేసి ఈ యాత్రను లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా లాల్ చౌక్ నుండి టూరిస్ట్ రిసెప్షన్ సెంటర్ వరకు నిర్వహించిన పాదయాత్రలో స్వయంసేవకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడ నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా ఈ యాత్ర దేశంలోని ఇతర రాష్ట్రాల వైపు సాగనుంది. ఈ యాత్ర ద్వారా ఆర్.ఎస్.ఎస్ కేవలం ఒక వర్గానికి వ్యతిరేకం కాదని, దేశ సమగ్రత కోసం పనిచేసే సంస్థ అనే సందేశాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు భావిస్తున్నారు. యాత్ర పొడవునా వివిధ ప్రాంతాల్లో స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

యాత్రలో పాల్గొన్న ప్రముఖ కార్యకర్త వీర్ కపూర్ మాట్లాడుతూ, "ఆర్.ఎస్.ఎస్ పట్ల కొంతమందిలో ఉన్న తప్పుడు అభిప్రాయాలను, వక్రీకరించిన చరిత్రను సరిదిద్దడమే మా ప్రధాన ఉద్దేశ్యం. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతిని కాపాడుతూ, సంస్థ చేసిన సేవలను అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము" అని పేర్కొన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుమారు 3,676 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్ర ద్వారా జాతీయ సమగ్రతను చాటనున్నారు.

మరోవైపు, ఆర్.ఎస్.ఎస్ 100 సంవత్సరాల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్మించిన 'శతక్' అనే చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యాత్ర కొనసాగుతుండగానే, ఫిబ్రవరి 19న ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల కానుంది. సంస్థ ఏర్పాటు నుండి ఇప్పటివరకు దేశ నిర్మాణంలో స్వయంసేవకులు పోషించిన పాత్రను ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నట్లు సమాచారం.

'ధ్వజ్ యాత్ర': కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆర్.ఎస్.ఎస్ భారీ ర్యాలీ - Tholi Paluku