
దోషి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన రాష్ట్రపతి
మహారాష్ట్రలో 2012లో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన కేసులో, రెండేళ్ల చిన్నారిని అపహరించి అత్యాచారం చేసి హత్య చేసిన వ్యక్తి దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత (జూలై 25, 2022) ద్రౌపది ముర్ము తిరస్కరించిన మూడవ క్షమాభిక్ష పిటిషన్ ఇదే.
ఈ కేసులో దోషిగా తేలిన రవి అశోక్ ఘుమారే అనే వ్యక్తికి సుప్రీంకోర్టు 2019 అక్టోబర్ 3న మరణశిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం (2:1 మెజారిటీతో) తీర్పు వెలువరించింది. తీర్పు రాస్తూ న్యాయమూర్తి సూర్యకాంత్ (ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తి) మాట్లాడుతూ, నిందితుడు తన లైంగిక కోరికలపై ఎలాంటి నియంత్రణ లేకుండా, సహజ, సామాజిక, చట్టపరమైన హద్దులన్నింటినీ అతిక్రమించాడు. ఇంకా వికసించాల్సిన ఒక చిన్నారి జీవితాన్ని క్రూరంగా ముగించాడని వ్యాఖ్యానించారు.
తీర్పులో కోర్టు మరింత తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
రెండేళ్ల చిన్నారిపై అసహజ లైంగిక దాడి చేయడం అతని వికృత, మలిన మనస్తత్వానికి నిదర్శనం. ఇది భయంకరమైన క్రూరత్వ కథ అని పేర్కొంది. చిన్నారిని సమాజంలోని చెడుల నుంచి కాపాడాల్సిన వ్యక్తి, తండ్రిలాంటి ప్రేమ, ఆప్యాయత చూపాల్సిన వయస్సులో ఉండి కూడా ఆమెను తన లైంగిక వాంఛలకు బలిచేశాడని మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది.
ఈ ఘటన నమ్మకద్రోహానికి, సామాజిక విలువల పతనానికి స్పష్టమైన ఉదాహరణ అని కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం ఈ దారుణ ఘటన 2012 మార్చి 6న మహారాష్ట్రలోని జాల్నా జిల్లా ఇందిరానగర్ ప్రాంతంలో జరిగింది. నిందితుడు చాక్లెట్ చూపించి చిన్నారిని మోసం చేసి తీసుకెళ్లాడు. అనంతరం నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఆమెపై లైంగిక దాడి చేసి, చివరకు ఆమె చిన్నారి మృతికి కారణమయ్యాడు. ఈ కేసులో ట్రయల్ కోర్టు 2015 సెప్టెంబర్ 16న రవి అశోక్ ఘుమారేకు మరణశిక్ష విధించింది. ఆ శిక్షను 2016 జనవరిలో బాంబే హైకోర్టు కూడా సమర్థించింది. తదుపరి నిందితుడు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్పై రాష్ట్రపతి భవన్ పరిశీలించింది. రాష్ట్రపతి భవన్ వెల్లడించిన అధికారిక సమాచారం ప్రకారం, ఆ క్షమాభిక్ష పిటిషన్ను 2025 నవంబర్ 6న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తుది నిర్ణయంగా తిరస్కరించారు.
