
దేశ సైనికులకు రుణపడి ఉంటాం: ప్రధాని మోడీ
దేశ సైనికులకు ఎల్లప్పుడు రుణ పడి ఉంటామని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం సైనిక దళాల పతాక దినోత్సవం సందర్భంగా భారత సైన్యం, నౌకాదళం, వాయుసేనలో సేవలందిస్తున్న ధైర్యవంతమైన పురుషులు, మహిళలకు ప్రధాని నరేంద్ర మోడీ వినయపూర్వకంగా కృతజ్ఞతలను తెలిపారు. సైనికులు చూపించే క్రమశిక్షణ, కట్టుబాటు, అచంచలమైన ధైర్యసాహసం దేశాన్ని రక్షించడమే కాకుండా ప్రజలకు శక్తినిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. వారి సేవలు దేశభక్తి, కర్తవ్య నిష్ఠకు ప్రకాశవంతమైన అద్దం అన్నారని కూడా తెలిపారు. సైనిక దళాల సంక్షేమం కోసం రూపొందించిన ఆర్మ్ డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్ కు అందరూ దోహదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సోషల్ మీడియా వేదికగా ప్రధాని స్పందన
సైనిక దళాల పతాక దినోత్సవం సందర్భంగా మన దేశ రక్షణ కోసం అచంచల ధైర్యంతో పనిచేస్తున్న ధైర్యవంతులైన సైనికులకు మన గాఢమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు చూపించే క్రమశిక్షణ, సంకల్పం, దేశభక్తి మనకు ప్రేరణ. సైనిక దళాల పతాక దినోత్సవ నిధికి మనం కూడా సహకరించాలి. 1949 డిసెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా సైనిక దళాల పతాక దినోత్సవం నిర్వహించుకుంటున్నారు. ఈ రోజు దేశ రక్షణలో జీవిత త్యాగం చేసిన వీరజవాన్లు, వీర నారుల కుటుంబాల పట్ల జాతి కృతజ్ఞతను గుర్తుచేసే సందర్భంగా నిలుస్తోంది.
సైనికులు ఏ దేశానికైనా అతి గొప్ప ఆస్తి. వారు ప్రజల రక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేస్తారని రక్షణ శాఖ గతంలో ఒక ప్రకటనలో పేర్కొంది. మాతృభూమి సేవలో ప్రాణత్యాగం చేసే ఈ వీర సైనీకుల ఋణం దేశం ఎప్పటికీ తీరదని మంత్రిత్వ శాఖ తెలిపింది.
