
దేశంలో సామాజిక విభజనలు ఇంకా లోతుగానే ఉన్నాయి:ఉజ్జల్ భూయన్
తన కుమార్తెకు స్నేహితురాలైన ఓ ముస్లింకు మత గుర్తింపుతో ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నిరాకరించిన ఘటనను ఉదాహరణగా పేర్కొంటూ, దేశం ఇంకా రాజ్యాంగ నైతికత ప్రమాణాలకు ఎంత దూరంలో ఉందో ఇది చూపుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ అన్నారు. తెలంగాణ జడ్జెస్ అసోసియేషన్, తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ నిర్వహించిన సదస్సులో బుధవారం ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నైతికత, ప్రజా నైతికత కంటే ప్రాముఖ్యమైనది కావాలి. అది మెజారిటీ అభిప్రాయం అయినప్పటికీ అని స్పష్టం చేశారు. భారతదేశంలో కోర్టు ఫీజులు ఇతర దేశాలతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, న్యాయవాదుల ఫీజులు వంటి అనుబంధ ఖర్చులు దూర ప్రాంతాల సాధారణ పౌరులకు కోర్టులను ఆశ్రయించడం కష్టతరం చేస్తున్నాయని ఆయన అన్నారు. రాజ్యాంగ లక్ష్యం సోదరభావం, సౌభ్రాతృత్వం సాధించడమేనని పేర్కొంటూ, ఇంటి వద్ద లేదా సమాజంలో మనం పాటించే నైతికత రాజ్యాంగం ఆశించే నైతికతతో సరిపోకపోవచ్చని చెప్పారు. వివాహాలు, అద్దె ఇళ్లు ఇవ్వడం వంటి విషయాల్లో ఈ తేడాలు స్పష్టంగా కనిపిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
తన కుమార్తె స్నేహితురాలు ఒక పీహెచ్డీ విద్యార్థిని ముస్లిం అని కారణంతో ఢిల్లీలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నడిపే ల్యాండ్లేడీ నివాసం ఇవ్వలేదని ఉదాహరణగా తెలిపారు. మీడియా కథనాలను ప్రస్తావిస్తూ, మధ్యాహ్న భోజన పథకంలో దళిత వంటమనిషి వండిన భోజనం పై కొందరు తల్లిదండ్రులు తీవ్రంగా నిరసన తెలిపిన ఘటనను కూడా ఆయన గుర్తుచేశారు.
ఇవి కేవలం యాదృచ్ఛిక ఉదాహరణలు మాత్రమే. హిమశిఖరపు పైభాగం మాత్రమే. 75 ఏళ్ల గణతంత్రం అయినప్పటికీ, మన సామాజిక విభజనలు ఎంత లోతుగా ఉన్నాయో ఇవి తెలియజేస్తున్నాయని భూయన్ అన్నారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నాజ్ ఫౌండేషన్ తీర్పును ప్రస్తావిస్తూ, ప్రజాదరణ పొందిన నైతికత లేదా సామాజిక నిరసనలను ఆధారంగా చేసుకుని ఆర్టికల్ 21 కింద ఉన్న మౌలిక హక్కులను పరిమితం చేయలేమని ఆ తీర్పు స్పష్టం చేసిందని తెలిపారు. లింగ ప్రాతినిధ్యం విషయానికొస్తే, ఇటీవలి సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా న్యాయ సేవల్లో మహిళల ప్రవేశం పెరిగిందని ఆయన అన్నారు. ఈ విషయంలో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.
తెలంగాణ న్యాయవ్యవస్థలో ప్రస్తుతం మూడు కేడర్లలో 76 ఎస్సీ న్యాయాధికారులు, 46 ఎస్టీ న్యాయాధికారులు, 25 మంది మైనారిటీ వర్గాలకు చెందిన న్యాయాధికారులు ఉన్నారని వెల్లడించారు. ఇంకా మెరుగుదలకు అవకాశం ఉన్నప్పటికీ, ఈ గణాంకాలు తెలంగాణ ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమగ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. అదనంగా, శారీరక వైకల్యాలను అధిగమించి విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు న్యాయాధికారులు రాష్ట్రంలో ఉన్నారని తెలిపారు.
