
దివ్యాంగులకు శుభవార్త: వివాహ ప్రోత్సాహక రూ. 2 లక్షలకు పెంపు
దివ్యాంగుల సంక్షేమం మరియు సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతిని ఇప్పటివరకు ఉన్నరూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయంతో దివ్యాంగులకు ఆర్థిక భరోసా మరింత బలపడనుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న సహాయం సరిపోవడం లేదని గుర్తించిన ప్రభుత్వం, దివ్యాంగుల భవిష్యత్తు భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రూ.2 లక్షల సహాయాన్ని భార్య పేరిట ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సమాజంలో దివ్యాంగులు సమాన హక్కులతో, ఆత్మగౌరవంతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. వివాహ సమయంలో ఎదురయ్యే ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు, కుటుంబాలకు తోడ్పాటు అందించడమే ఈ పెంపు ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ తాజా నిర్ణయం దివ్యాంగుల సంక్షేమంపై ఉన్న నిబద్ధతను మరోసారి చాటుతోంది.
