
దిత్వా తుఫాను బీభత్సం: శ్రీలంకలో 334కు చేరిన మృతుల సంఖ్య
శ్రీలంకలో ఇటీవల సంభవించిన అత్యంత భయంకరమైన ప్రకృతి విపత్తుల్లో ఒకటైన 'దిత్వా’ తుఫాను సృష్టించిన వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల మృతుల సంఖ్య 334కు చేరింది. మరో 370 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది. శ్రీలంకలోని చాలా జిల్లాలు ఈ భారీ వరదలు, కొండచరియలు విరిగిపడడం కారణంగా బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, ఒంటరిగా ఉండిపోయాయి. ఎమర్జెన్సీ ఆశ్రయాలు ప్రజలతో నిండిపోతున్నాయి. స్వచ్ఛంద సేవకులు ఆహారం, మందులు, శుభ్రమైన తాగునీటిని అందిస్తున్నారు. మరోవైపు, వర్షాలు ఇంకా కొనసాగుతుండటం, నదులలో నీటి మట్టాలు పెరుగుతుండటం వల్ల కొత్తగా మరిన్ని కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని స్థానిక అధికారులు హెచ్చరిస్తున్నారు.
భారత్ ఆపన్న హస్తం
తుఫాను ప్రభావంతో కష్టాల్లో ఉన్న శ్రీలంకకు సహాయం అందించేందుకు భారతదేశం 'ఆపరేషన్ సాగర్ బంధు' పేరుతో సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలకు పంపారు. ఆదివారం శ్రీలంకలో చిక్కుకుపోయిన కొంతమంది భారతీయ ప్రయాణికులను కూడా హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా భారత్కు తీసుకువచ్చారు.
సహాయక చర్యలు ముమ్మరం
శ్రీలంక, భారత బలగాలు కలిసి పెద్ద ఎత్తున సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. మావిల్ అరు ట్యాంక్ సమీపంలో 211 మందిని, కోట్మలే ప్రాంతంలో చిక్కుకున్న అనేక మందిని హెలికాప్టర్ల ద్వారా కాపాడారు. భారత వైమానిక దళం హెలికాప్టర్లు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తూ, అలాగే నిత్యావసరాలను ఒంటరిగా ఉండిపోయిన గ్రామాలకు చేరవేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పుట్టలం, బదుల్లా ప్రాంతాలలో బురదతో నిండిన నేల గుండా నడుస్తూ, వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మరోవైపు కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణికుల చివరి బ్యాచ్ తిరిగి స్వదేశానికి చేరుకుంది. సోమవారం ఉదయం 6.30 గంటలకు భారత వాయుసేన విమానంలో 104 మంది భారతీయులు తిరువనంతపురం చేరుకున్నారు.
శ్రీలంకకు నేపాల్
ఈ కష్ట సమయంలో శ్రీలంకకు అండగా ఉంటామని ప్రకటిస్తూ, నేపాల్ ప్రభుత్వం అక్కడి సహాయక చర్యల కోసం రెండు లక్షల అమెరికన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరణించిన వారి కుటుంబాలకు హృదయపూర్వక సంతాపం తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. శ్రీలంక ప్రజలు ఈ విషాదం నుంచి కోలుకుని, మళ్లీ తమ దేశాన్ని నిర్మించుకోగల సామర్థ్యం, బలంపై తమకు నమ్మకం ఉందని నేపాల్ పేర్కొంది.
జాతీయ అత్యవసర పరిస్థితి
దిత్వా తుఫాను బీభత్సం వేళ శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సహాయక, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడానికి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం గల్లంతైన వారిని గుర్తించడం, విపత్తు కారణంగా సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు తిరిగి చేరుకోవడానికి మార్గాలను పునరుద్ధరించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.
