
దేవుళ్లనూ వదలని సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు దేవుళ్లను కూడా వదలడం లేదు. నకిలీ వెబ్ సైట్ లు సృష్టించి భక్తులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇదే విధమైన మోసం షిర్డీలో వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా షిర్డీ సాయిబాబాకు ఎంతోపేరుంది. దీంతో దేశ, విదేశాల నుంచి భక్తులు ప్రతి రోజు తరలివస్తుంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే వారి కోసం షిర్డీ సంస్థాన్ రూమ్ ల వివరాలు, పాస్ దర్శన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో పొందుపరుస్తుంటుంది. దానిప్రకారం వివరాలు తెలుసుకుని భక్తులు షిర్డీని సందర్శిస్తుంటారు. అయితే ఓ భక్తుడు కుటుంబంతో పాటు షిర్డీ వెళ్లాలని నిర్ణయించుకుని ‘సంస్థాన్ భక్త నివాస్’ అనే పేరుతో ఉన్న వెబ్ సైట్ లో దర్శన టికెట్లు కొని మోసపోయాడు.
స్కానర్ ను పంపించారు, డబ్బులు చెల్లించాడు
ఇటీవల కర్ణాటకకు చెందిన రాము జాదవ్ అనే వ్యక్తి తన మనవడి పుట్టినరోజును కుటుంబంతో సహ షిర్డీ కి వెళ్లాలనుకున్నాడు. దీంతో వెంటన్ కొడుకును ఆన్లైన్ లో దర్శన టికెట్లు, అక్కడ ఉండడానికి ఓ గదిని బుక్ చేయమని పురమాయించాడు. దీంతో ఆయన గూగుల్ సర్చ్ చేస్తుండగా అన్ని డిజైన్లతో ‘సంస్థాన్ భక్త నివాస్’ అనే వెబ్సైట్ కనబడింది. దీంతో అదే నిజమైనదనుకుని బుకింగ్ చేశాడు. అక్కడి వారు ఓ వాట్సాప్ స్కానర్ ను పంపించారు. దానికి అమౌంట్ పంపించమని తెలిపారు. వెంటనే రూ.2100 చెల్లించాడు. రశీదును ఆలయంలోని కౌంటర్ దగ్గర తీసుకోవాలని సూచించారు. దీంతో కుటుంబ మొత్తం సంతోషంగా షిర్డీ వెళ్లారు. అక్కడికి వెళ్లి గదిని బుక్ చేసుకున్నామని ఆలయ అధికారులకు వివరించారు. అయితే ఈ పేరుతో ఎలాంటి గది బుక్ కాలేదని, డబ్బులు కూడ పంపలేదని తెలిపారు. దాంతో వారు మోసపోయామని గ్రహించారు. అయితే ఈ విషయాన్ని ఆలయ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి వ్యవహారాలు జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అన్ని వివరాల కోసం అధికారికి వెబ్సైట్ నే ఉపయోగించాలని సూచించారు. www.sai.org.in నే మీరు సంప్రదించాలని, భవిష్యత్ లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలని కోరారు.
