Let's talk: editor@tmv.in
దక్షిణ కొరియాపై ట్రంప్ ‘టారిఫ్’ బాంబు!

దక్షిణ కొరియాపై ట్రంప్ ‘టారిఫ్’ బాంబు!

Shaik Mohammad Shaffee
28 జనవరి, 2026

గతేడాది అమెరికా–దక్షిణ కొరియా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి అక్కడి శాసనసభ ఇంకా ఆమోదం తెలపకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒప్పందం అమలులో జాప్యం జరుగుతోందన్న కారణంతో దక్షిణ కొరియా వస్తువులపై సుంకాలు (టారిఫ్‌లు) పెంచుతామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఆటోమొబైల్స్, కలప, ఔషధాలపై దిగుమతి పన్నులు పెంచుతామని, మిగిలిన వస్తువులపై ప్రస్తుతం ఉన్న 15 శాతం టారిఫ్‌ను ఏకంగా 25 శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఒప్పందాలపై వేగంగా చర్యలు అవసరం

“మా వాణిజ్య ఒప్పందాలు అమెరికాకు అత్యంత కీలకం. ప్రతి ఒప్పందంలోనూ మేము వేగంగా టారిఫ్‌లను తగ్గించాం. అదే విధంగా మా ట్రేడింగ్ భాగస్వాములు కూడా వ్యవహరించాలని ఆశిస్తున్నాం” అని ట్రంప్ స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్‌ను పక్కనపెట్టి ‘ఆర్థిక అత్యవసర పరిస్థితి’ని ప్రకటించి టారిఫ్‌లు విధించిన ట్రంప్, ఈసారి దక్షిణ కొరియా పార్లమెంట్ ఆమోదంలో జాప్యాన్ని కారణంగా చూపుతున్నారు. జూలైలో ప్రకటించి, అక్టోబర్‌లో ట్రంప్ పర్యటన సందర్భంగా ధృవీకరించిన ఒప్పందానికి సియోల్‌లో శాసనసభ ఆమోదం తప్పనిసరి.

మళ్లీ టారిఫ్ సమరం..

గతేడాది మొదలైన టారిఫ్ రాజకీయాలు ఈ ఏడాదీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్‌లను ఆయుధంగా మార్చుకుని ఇతర దేశాలను ఒప్పందాలకు ఒత్తిడి చేసే విధానం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితిని పెంచుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ఓటర్లు కూడా వాణిజ్య వ్యవస్థ ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

350 బిలియన్ డాలర్ల పెట్టుబడులు

ట్రంప్ గతంలో దక్షిణ కొరియా అమెరికాలో 350 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిందని, అందులో అమెరికన్ షిప్‌యార్డుల పునరుజ్జీవన ప్రాజెక్టులు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే రెండు దేశాల సంబంధాలు ఎప్పుడూ సాఫీగా సాగలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. గతేడాది జార్జియాలోని హ్యుందాయ్ తయారీ కేంద్రంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు దాడులు చేసి 475 మందిని అదుపులోకి తీసుకోవడం కూడా సంబంధాల్లో ఉద్రిక్తతకు కారణమైంది.

ద.కొరియా ప్రభుత్వ స్పందన

ట్రంప్ ప్రకటన తర్వాత, దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి, గతేడాది ఒప్పందాన్ని అమలు చేయడంపై తమ నిబద్ధతను అమెరికాకు తెలియజేస్తామని ప్రకటించింది. పరిశ్రమల మంత్రి కిమ్ జంగ్-క్వాన్ అమెరికా వెళ్లి వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్‌తో చర్చలు జరపనున్నారు. అలాగే వాణిజ్య మంత్రి యో హాన్-కూ, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమిసన్ గ్రీర్‌ను వేరుగా కలవనున్నారు. కిమ్ ప్రస్తుతం కెనడా పర్యటనలో ఉన్నారు.

పార్లమెంట్‌లో ఐదు బిల్లులు

దక్షిణ కొరియా శాసనసభ్యులు, 350 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీ అమలుకు సంబంధించిన ఐదు బిల్లులను నేషనల్ అసెంబ్లీకి సమర్పించారు. ఇవి ప్రస్తుతం ఫైనాన్స్ కమిటీ ముందు ఉన్నాయి. పాలక డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి కిమ్ హ్యూన్-జంగ్ మాట్లాడుతూ, ప్రభుత్వంతో కలిసి వేగంగా చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఐదు బిల్లులను ఒకే చట్టంగా విలీనం చేసి, ఫైనాన్స్, జ్యుడిషియరీ కమిటీల ఆమోదం తర్వాత సభలో ఓటింగ్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని అసెంబ్లీ అధికారులు చెప్పారు.

ఇతర దేశాలపైనా టారిఫ్ బెదిరింపులు

దక్షిణ కొరియాపై తాజా హెచ్చరికలు, ట్రంప్ టారిఫ్ విధానంలో కొనసాగుతున్న ధోరణినే ప్రతిబింబిస్తున్నాయి. గత వారం గ్రీన్‌ల్యాండ్‌పై నియంత్రణ ఇవ్వకపోతే ఎనిమిది యూరోపియన్ దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని బెదిరించిన ట్రంప్, దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల తర్వాత ఆ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. కెనడా చైనాతో వాణిజ్యాన్ని పెంచితే, ఆ దేశపు వస్తువులపై 100 శాతం పన్ను విధిస్తామని కూడా ట్రంప్ ఇటీవల ప్రకటించారు.

ఇంకా ఆమోదం కాని ఒప్పందాలు

ట్రంప్ తన వాణిజ్య ఫ్రేమ్‌వర్క్‌ల వల్ల అమెరికాకు భారీ పెట్టుబడులు వస్తున్నాయని గొప్పగా చెబుతున్నప్పటికీ, అనేక ఒప్పందాలు ఇంకా పూర్తిస్థాయిలో అమలుకి రాలేదు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన 27 దేశాల ఎగుమతులపై 15 శాతం పన్ను విధించే ఒప్పందానికి ఇప్పటికీ యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం లభించలేదు. అలాగే 2020లో సవరించిన కెనడా–మెక్సికో వాణిజ్య ఒప్పందాన్ని ఈ ఏడాది మళ్లీ పునర్విచారణ చేయనున్నట్లు అమెరికా సంకేతాలు ఇచ్చింది.

ఒకవైపు 1962 నాటి వాణిజ్య విస్తరణ చట్టం సెక్షన్ 232 కింద జాతీయ భద్రత పేరుతో పలు దిగుమతులపై విచారణలు కొనసాగుతుండగా, మరోవైపు 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ద్వారా సుంకాలు విధించే విషయంలో ట్రంప్ తన పరిధిని మించి వ్యవహరించారా లేదా అన్న అంశంపై అమెరికా సుప్రీంకోర్టు వెలువరించనున్న తీర్పు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.