
థాయ్లాండ్లో ఘోర ప్రమాదం: రైలుపై భారీ క్రేన్ పడి 22 మంది మృతి!
థాయ్లాండ్లో బుధవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ప్రయాణికుల రైలుపై నిర్మాణ రంగంలో వాడే భారీ క్రేన్ అకస్మాత్తుగా కూలిపడటంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్ నుంచి ఈశాన్య ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
అసలేం జరిగింది?
స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్కు వెళ్తున్న రైలు నఖోన్ రాట్చసిమా ప్రావిన్స్లోని సిఖియో జిల్లా గుండా ప్రయాణిస్తోంది. ఈ మార్గానికి సమాంతరంగా నిర్మిస్తున్న చైనా-థాయ్లాండ్ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు పనుల్లో ఒక భారీ క్రేన్ను ఉపయోగిస్తున్నారు. రైలు వెళ్తున్న సమయంలో ఆ క్రేన్ అదుపుతప్పి నేరుగా ఒక బోగీపై పడిపోయింది.
నరకప్రాయంగా మారిన బోగీలు
క్రేన్ పడిన ధాటికి రైలుకు చెందిన పలు కోచ్లు పట్టాలు తప్పడమే కాకుండా, స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలులో మొత్తం 195 మంది ప్రయాణికులు ఉన్నట్లు థాయ్ రవాణా మంత్రి పిఫత్ రాట్చకిత్ ప్రకార్న్ తెలిపారు. క్రేన్ బరువుకు బోగీలు నుజ్జునుజ్జు కావడంతో ప్రయాణికులు లోపల చిక్కుకుపోయి హాహాకారాలు చేశారు. గాయపడిన 30 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
సహాయక చర్యలు
సమాచారం అందగానే అగ్నిమాపక దళాలు, వైద్య బృందాలు, విపత్తు నిర్వహణ బలగాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. పలువురు ప్రయాణికులను బోగీల నుంచి బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది.
భద్రతా లోపమే కారణమా?
నిర్మాణ పనుల వద్ద సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. కదులుతున్న రైళ్ల పక్కనే భారీ క్రేన్లతో పనులు చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు థాయ్ ప్రభుత్వం ఆదేశించింది.
