
థానేలో రూ.13 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం
మహారాష్ట్రలోని థానే నగరంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో రూ.13 కోట్లకు పైగా విలువైన నాలుగు కిలోలకుపైగా హెరాయిన్ను స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో ఒకరికి ముంబై అండర్వరల్డ్ తో సంబంధాలు ఉన్నాయని, అలాగే 1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్ల కేసు దర్యాప్తులో కూడా అతని పేరు బయటపడినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఫిబ్రవరి 3 తెల్లవారుజామున క్రైం బ్రాంచ్ బృందం నిర్వహించిన దాడిలో, అత్యంత మత్తు పదార్థమైన హెరాయిన్ను రూ.6.9 కోట్ల విలువైన పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైం) అమర్సింగ్ జాధవ్ శుక్రవారం రాత్రి తెలిపారు. డివా ప్రాంతంలోని ఒక పాఠశాల సమీపంలో 47 ఏళ్ల వజాహత్ సయీద్ను హెరాయిన్తో పాటు పోలీసులు పట్టుకున్నారు. అతని విచారణలో భాగంగా ప్రధాన సరఫరాదారుగా గుర్తించిన 67 ఏళ్ల మహ్మద్ మహదిక్ను అరెస్ట్ చేశారు.
1993 బాంబు పేలుళ్ల అనంతరం మహదిక్ దేశం విడిచి పారిపోయి, సుమారు 22 ఏళ్ల పాటు మస్కట్, ఓమన్లలో నకిలీ గుర్తింపుతో జీవించిన అనంతరం భారత్కు తిరిగి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 1990ల కాలంలో అతడు అండర్వరల్డ్ లో ప్రభావవంతమైన వ్యక్తిగా ఉండేవాడని, దావూద్ ఇబ్రహీం సహా అప్పటి గ్యాంగ్లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. హత్య, అపహరణ, బెదిరింపులు, నకిలీ పాస్పోర్టు వినియోగం వంటి పలు కేసులు అతనిపై నమోదై ఉన్నట్లు తెలిపారు.
ఇదే కేసులో మరో దాడిలో, ఫిబ్రవరి 1న ఘోడ్బందర్ ప్రాంతంలో 50 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ ఫర్దీన్ గుల్జార్ ముల్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి రూ.6.68 కోట్ల విలువైన హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు ఘటనల్లో కలిపి రూ.13 కోట్లకు పైగా విలువైన నాలుగు కిలోలకుపైగా హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల మూలం, అవి ఎవరికీ సరఫరా చేయాల్సి ఉందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని, డ్రగ్ సరఫరా నెట్వర్క్లో ఉన్న ఇతరులను గుర్తించే ప్రయత్నం జరుగుతోందని డీసీపీ జాదవ్ చెప్పారు. ఈ ఘటనలకు సంబంధించి మత్తు పదార్థాలు, మానసిక ప్రభావక ఔషధాల చట్టం (ఎన్డీపీఎస్ యాక్ట్) కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
