Let's talk: editor@tmv.in
త్వరలో భారత్‌కు కెనడా ప్రధాని మార్క్ కార్నీ

త్వరలో భారత్‌కు కెనడా ప్రధాని మార్క్ కార్నీ

Shaik Mohammad Shaffee
14 జనవరి, 2026

అమెరికా విధించిన భారీ సుంకాల నేపథ్యంలో తమ వాణిజ్యాన్ని విస్తరించుకునేందుకు కెనడా కొత్త ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ త్వరలో భారత్‌ను సందర్శించనున్నట్లు కెనడాలోని భారత హైకమిషనర్ దినేశ్ పట్నాయక్ తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సహకారాన్ని పెంచడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంటుందని చెప్పారు.

అమెరికా పన్నుల పోటు .. కొత్త మార్గాల అన్వేషణ

ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య పరిస్థితులు మారుతున్నాయని, అమెరికాపై ఆధారాన్ని తగ్గిస్తూ ఇతర దేశాలతో వ్యాపారాన్ని పెంచుకోవాలని కెనడా భావిస్తోంది. వచ్చే దశాబ్దంలో అమెరికాకు కాకుండా ఇతర దేశాలకు చేసే ఎగుమతులను రెండింతలు పెంచాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌తో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయాలని కెనడా నిర్ణయించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు భారత్, కెనడాలపై ప్రభావం చూపుతున్నాయి. భారత్ నుంచి వచ్చే వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు ఉండగా, కెనడాపై 35 శాతం సుంకాలు విధించారు. ఈ పరిస్థితుల్లో కొత్త మార్కెట్లు అవసరమని కెనడా భావిస్తోంది.

పర్యటన ఎప్పుడు?

కెనడా ప్రధాని కార్నీ భారత్ పర్యటన ఫిబ్రవరి 1న భారత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగే అవకాశం ఉందని దినేశ్ పట్నాయక్ తెలిపారు. రెండు దేశాల మధ్య మళ్లీ నమ్మకం పెరుగుతోందని, గతంలో నిలిచిపోయిన పథకాలను తిరిగి ముందుకు తీసుకెళ్లేందుకు దౌత్యవేత్తలు పనిచేస్తున్నారని చెప్పారు.

గతాన్ని వీడి.. కొత్త నమ్మకంతో..

భారత్–కెనడా మధ్య సంబంధాల్లో 2023లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఖలిస్తానీ వేర్పాటువాదుల అంశం, కెనడాలో ఉగ్రవాదిగా గుర్తించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం. అయితే ఆ ఆరోపణలను భారత్ పూర్తిగా ఖండించింది. భారత ప్రభుత్వానికి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

మారిన కెనడా తీరు- మోడీ ఆహ్వానం

ఇప్పుడు కెనడా కొత్త నాయకత్వంలో విధానాలు మారుతున్నాయని భారత హైకమిషనర్ తెలిపారు. ప్రధాని కార్నీ వ్యవహారశైలి భిన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గతేడాది జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2026 ప్రారంభంలో భారత్‌కు రావడానికి కార్నీ అంగీకరించారు.

ఇటీవల రెండు దేశాలు హైకమిషనర్లను తిరిగి నియమించుకోవడంతో దౌత్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేయడం, కాన్సులర్ సేవలను విస్తరించడం పైనా ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. చట్ట అమలు సంస్థల మధ్య సహకారం కూడా పెరుగుతోందని కెనడా ప్రధాని స్వాగతించారు.

భారీ వాణిజ్య ఒప్పందం

భారత్, కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై చర్చలు ప్రారంభించేందుకు కూడా అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా 2030 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జనవరి 13 నుండి చైనాలో కార్నీ పర్యటన

కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ జనవరి 13 నుండి 17 వరకు చైనాలో పర్యటించనున్నారు. అమెరికా విధిస్తున్న పన్నుల భారం నుండి తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి, చైనాతో తిరిగి వ్యాపార సంబంధాలను బలపరుచుకోవడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ప్రీమియర్ లీ కియాంగ్‌లతో సమావేశమై ఇంధనం, వ్యవసాయం, భద్రత వంటి కీలక రంగాలలో చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా కెనడాకు చెందిన 'కనోలా' గింజల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను తొలగించుకోవాలని కెనడా భావిస్తోంది.

అయితే, ఈ పర్యటనపై కెనడాలో రాజకీయ దుమారం రేగుతోంది. చైనాకు తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భయంతో ఇద్దరు ఎంపీలు తమ తైవాన్ పర్యటనను మధ్యలోనే ఆపేయడం చర్చనీయాంశమైంది. కెనడా ప్రభుత్వం చైనా ఒత్తిడికి తలొగ్గుతోందని అక్కడి ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ విమర్శిస్తోంది. అయినప్పటికీ, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చైనాతో మైత్రిని కొనసాగించాలని కెనడా ప్రభుత్వం భావిస్తోంది.

త్వరలో భారత్‌కు కెనడా ప్రధాని మార్క్ కార్నీ - Tholi Paluku