
తొలి 6 ఓవర్లలోనే సంజూ మ్యాచ్ను మలుపు తిప్పగలడు: గంభీర్
టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అసలైన విధ్వంసక రూపం చూపిస్తే పవర్ప్లేలోనే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించగలడని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసించారు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో భారత్ రికార్డు స్థాయిలో మూడోసారి విశ్వవిజేతగా నిలవడంలో శాంసన్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక సమరాల్లో మెరుపు అర్ధశతకాలతో అతడు జట్టును ఆదుకున్న తీరును గంభీర్ కొనియాడారు.
నిరూపించుకున్న శాంసన్.. గంభీర్తో ఆసక్తికర చర్చ
న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో అభిషేక్ శర్మతో కలిసి సంజూ శాంసన్ పవర్ప్లేలోనే ఏకంగా 92 పరుగులు రాబట్టి కివీస్ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. గంభీర్ మాట్లాడుతూ.. "సంజూ సామర్థ్యంపై మాకు ఎప్పుడూ సందేహాలు లేవు. అతడు క్రీజులో నిలదొక్కుకుంటే తొలి ఆరు ఓవర్లలోనే విజయాన్ని మనవైపు తిప్పగలడు" అని పేర్కొన్నారు. ప్రపంచకప్ ఆరంభంలో శాంసన్కు అవకాశం రాకపోయినా, జింబాబ్వేతో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో 15 బంతుల్లోనే 24 పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా 97 (నాటౌట్), 89, 89 పరుగులు చేసి తన సత్తా ఏంటో చాటాడు. జిమ్లో శిక్షణ పొందుతున్న సమయంలోనే సంజూకి తదుపరి మ్యాచ్ ఆడుతున్నావు అని తాను క్యాజువల్గా చెప్పానని, వారి మధ్య కోచ్-ప్లేయర్ సంబంధం కంటే ఒక స్నేహపూర్వక బంధం ఉంటుందని గంభీర్ వెల్లడించారు.
విధ్వంసం కోసమే!
టాప్ ఆర్డర్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి ముగ్గురు ఎడమ చేతి వాటం బ్యాటర్ల కలయికను విడగొట్టడానికి సంజూను తుది జట్టులోకి తీసుకోలేదని గంభీర్ స్పష్టం చేశారు. "టాప్ ఆర్డర్లో మాకు మరింత దూకుడు కావాలని భావించాం. గత ఏడాదిన్నరగా మా ఆలోచనా విధానం ఒక్కటే.. మైదానంలోకి దిగి దూకుడుగా ఆడటం. ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కోవడం కోసం కాకుండా, తొలి ఆరు ఓవర్లలోనే అత్యంత దూకుడుగా పరుగులు రాబట్టడానికే సంజూను ఎంచుకున్నాం" అని ఆయన వివరించారు.
అభిషేక్ శర్మకు భరోసా
టోర్నీ ఆరంభంలో మూడుసార్లు డకౌట్ అయి విమర్శలు ఎదుర్కొన్న ఓపెనర్ అభిషేక్ శర్మపై గంభీర్ నమ్మకం వ్యక్తం చేశారు. "అభిషేక్కు నేను ఒకటే చెప్పాను.. నువ్వు ఫామ్లో లేవు అనడం తప్పు, నీకు పరుగులు రాలేదు అంతే. 20-30 బంతులు ఆడినప్పుడు మాత్రమే ఫామ్ను జడ్జ్ చేయగలం. 2014 ఐపీఎల్లో వరుసగా మూడు సార్లు డకౌట్ అయిన చేదు అనుభవం నాకూ ఉంది. అందుకే తదుపరి మ్యాచ్లో మరింత దూకుడుగా ఆడమని ప్రోత్సహించాను" అని గంభీర్ తెలిపారు. అంతిమంగా జట్టులో ఎంపికైన ప్రతి ఆటగాడిపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
