Let's talk: editor@tmv.in
తొలి బోర్డు పరీక్ష రాయాల్సిందే.. టెన్త్ పరీక్షలపై సీబీఎస్‌ఈ కీలక ప్రకటన

తొలి బోర్డు పరీక్ష రాయాల్సిందే.. టెన్త్ పరీక్షలపై సీబీఎస్‌ఈ కీలక ప్రకటన

Shaik Mohammad Shaffee
17 ఫిబ్రవరి, 2026

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పదో తరగతి విద్యార్థులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇకపై నిర్వహించే తొలి బోర్డు పరీక్షకు హాజరుకావడం ప్రతి విద్యార్థికీ తప్పనిసరి అని స్పష్టం చేసింది. మొదటి పరీక్ష రాయకుండా, నేరుగా రెండో పరీక్షకు హాజరవుతామనే వెసులుబాటు లేదని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో బోర్డు తేల్చిచెప్పింది. ఒకవేళ ఎవరైనా విద్యార్థి మొదటి పరీక్షలో మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు గైర్హాజరైతే, వారు రెండో పరీక్ష రాయడానికి అనర్హులని బోర్డు పేర్కొంది.

సందేహాలకు తెరదించుతూ స్పష్టీకరణ

వివిధ కారణాల వల్ల మొదటి బోర్డు పరీక్షకు హాజరు కాలేకపోతున్నామని, నేరుగా రెండో పరీక్షకు తమను అనుమతించాలని విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు రావడంతో సీబీఎస్‌ఈ ఈ కీలక వివరణ ఇచ్చింది. శనివారం జారీ చేసిన అధికారిక లేఖలో నిబంధనల ప్రకారం మొదటి పరీక్షకు హాజరుకావడం విధిగా పేర్కొంటూ, దానిని తప్పనిసరి చేసింది. అయితే, మొదటి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు తమ మార్కులను మెరుగుపర్చుకునే (ఇంప్రూవ్‌మెంట్) అవకాశం కల్పించింది. సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్ మరియు లాంగ్వేజెస్ వంటి ప్రధాన సబ్జెక్టులలో ఏవైనా మూడింటిలో మార్కులు పెంచుకోవడానికి రెండో పరీక్షను ఉపయోగించుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది.

అర్హత కోల్పోతే 'ఎసెన్షియల్ రిపీట్'

మొదటి పరీక్షను నిర్లక్ష్యం చేసే విద్యార్థులపై బోర్డు కఠినంగా వ్యవహరించనుంది. ఒక విద్యార్థి 3 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు మొదటి విడతలో రాయకపోతే, వారిని 'ఎసెన్షియల్ రిపీట్' కేటగిరీలో చేరుస్తారు. అంటే అటువంటి విద్యార్థులు మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ప్రధాన పరీక్షలకు మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే మొదటి పరీక్షలో ఫెయిల్ అయ్యి 'కంపార్ట్‌మెంట్' వచ్చిన విద్యార్థులు మాత్రం రెండో పరీక్షలో ఆయా సబ్జెక్టులు రాసుకోవచ్చు.

రెండో పరీక్షకు ఎవరెవరు అర్హులంటే?

రెండో విడత బోర్డు పరీక్షలకు హాజరయ్యేందుకు సిబిఎస్‌ఈ నాలుగు రకాల విద్యార్థులకు అవకాశం కల్పించింది. గరిష్టంగా మూడు ప్రధాన సబ్జెక్టులలో మార్కులు పెంచుకోవాలనుకునే వారు (ఇంప్రూవ్‌మెంట్), మొదటి లేదా మూడో ప్రయత్నంలో ఫెయిల్ అయ్యి కంపార్ట్‌మెంట్ వచ్చిన వారు ఈ పరీక్ష రాయవచ్చు. అలాగే, ఒకేసారి కంపార్ట్‌మెంట్ పరీక్షతో పాటు మార్కులు పెంచుకోవాలనుకునే వారికి, సబ్జెక్టు మార్పు ద్వారా పాస్ అయ్యి ఇప్పుడు తమ గ్రేడ్లను మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థులకు కూడా ఈ రెండో పరీక్ష రాసే అర్హత ఉంటుంది.

పదో తరగతి పాసైన తర్వాత అదనపు సబ్జెక్టులు రాయడానికి అనుమతి ఉండదని, అలాగే విడిగా సబ్జెక్టులు రాసేందుకు అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ నిబంధనలకు సంబంధించి ఇకపై ఎలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోమని బోర్డు తన లేఖలో చివరగా పేర్కొంది.