
తెలంగాణ రోడ్ల రూపురేఖలు మార్చే విప్లవాత్మక ప్రణాళిక
తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద రోడ్ల అభివృద్ధి ప్రణాళికకు సీఎం ఏ. రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం రూ.60,799 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు మౌలిక సదుపాయాల రూపురేఖలు మార్చే ఈ మెగా ప్రాజెక్ట్ తెలంగాణ అభివృద్ధి పథంలో మైలురాయిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ భారీ ప్రణాళికతో రాష్ట్రం బహుళజాతి కంపెనీలకు కేంద్రబిందువుగా మారి, లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించనుందని సీఎం అన్నారు.
హైదరాబాద్–విజయవాడ ఎనిమిది లైన్ ఎక్స్ప్రెస్ హైవే
ప్రధాన ఆకర్షణగా రూ.10,400 కోట్ల వ్యయంతో హైదరాబాద్–విజయవాడ హైవేను ఎనిమిది లైన్ల ఎక్స్ప్రెస్ వేపైగా విస్తరించనున్నారు. ఇది రెండు నగరాల మధ్య రవాణా సౌలభ్యాన్ని పెంచి, పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేయనుంది.
రీజనల్ రింగ్ రోడ్ – రాష్ట్ర రవాణాకు కొత్త దిశ
రూ.36,000 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్న రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్ట్ రాష్ట్ర ఆర్థిక, రవాణా రంగాల్లో కీలక మలుపు కానుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తెలంగాణలో సరుకు, ప్రయాణ రవాణా వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పు రానుందని అధికారులు తెలిపారు.
గ్రామీణ రోడ్లకు ప్రాధాన్యం
రోడ్ల లేని గ్రామాలకు కొత్త మార్గాలు, సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్గా అప్గ్రేడ్ చేసే పనులకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. సమానాభివృద్ధి లక్ష్యంగా జిల్లాల వారీగా ఈ పనులు చేపట్టనున్నారు.
11,399 కోట్ల హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హెచ్ఏఎం) ప్రాజెక్ట్,ఈ ప్రణాళికలో మరో ప్రధాన అంశం ప్రాజెక్ట్ కోసం రూ.11,399 కోట్లు కేటాయించి. త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు.
మన్నానూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్
52 కిలోమీటర్ల పొడవున, పర్యావరణ సున్నిత ప్రాంతాల గుండా రూ.8,000 కోట్ల వ్యయంతో మన్నానూరు–శ్రీశైలం మధ్య ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఇది పర్యాటకాభివృద్ధికి, భక్తుల సౌలభ్యానికి దోహదం చేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఫ్యూచర్ సిటీ–బందర పోర్ట్ గ్రీన్ఫీల్డ్ హైవే
హైదరాబాద్ ‘ఫ్యూచర్ సిటీ’ నుంచి అమరావతి మార్గంగా బందర పోర్ట్ వరకు రూ.20,000 కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం ప్రణాళికలో ఉంది. ఈ రహదారి రాష్ట్ర ఆర్థిక పటాన్ని పూర్తిగా మార్చివేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ ఆమోదాన్ని “చరిత్రాత్మక, అపూర్వమైనది”గా వర్ణించారు. ప్రతి 15 రోజులకు సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు స్వయంగా సమీక్షలు నిర్వహించారని తెలిపారు. నా రాజకీయ జీవితంలో ఇదొక గొప్ప అవకాశం. నాయకత్వం నాపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా యాదాద్రి, సూర్యాపేట, రంగారెడ్డి, సిద్దిపేట, నాగర్కర్నూల్, మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలు ప్రధాన లబ్ధిదారులుగా మారనున్నాయి.అదే సమయంలో, మిగతా జిల్లాల్లో గ్రామీణ రోడ్ల అప్గ్రేడేషన్ ద్వారా సమానాభివృద్ధి లక్ష్యం సాధ్యం అవుతుంది.
