
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు ప్రధాని, రాహుల్కు సీఎం ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనకు వెల్లనున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీలను ‘తెలంగాణరైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఆహ్వానించనున్నారు. ఈ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ శివార్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో జరగనుంది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి మంగళవారం రాత్రి జాతీయ రాజధానికి బయలుదేరి, నేడు మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. నవంబర్ 30న ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో కూడా ముఖ్యమంత్రి పలు కేంద్ర మంత్రులు, ఖర్గే, రాహుల్ గాంధీలకు అధికారిక ఆహ్వానాలు అందజేయనున్నట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సమ్మిట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సమ్మిట్ వేదికగా నిర్ణయించిన ప్రాంతంలో అభివృద్ధి చేయనున్న ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు దేశంలో తొలి నెట్-జీరో సిటిగా రూపుదిద్దుకోనుందని అధికారులు తెలిపారు. పర్యావరణహితంగా, ఆర్థికపరంగా బలమైన అభివృద్ధి నమూనాగా దీనిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.సమ్మిట్లో భాగంగా, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే తమ మహా దూరదృష్టి పథకాన్ని ప్రభుత్వం విడుదల చేయనుంది. రాబోయే దశాబ్దాల అభివృద్ధి మార్గసూచిని కూడా సమ్మిట్లో వివరంగా ప్రవేశపెట్టనుంది.
ఈ కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ పరిశ్రమాధిపతులు, ఆర్థిక నిపుణులు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, రాయబారులు, వివిధ రంగాల నిపుణులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే సుమారు 4,500 మందికి ఆహ్వానాలు పంపగా, వారిలో 1,000 మంది హాజరుకానున్నట్లు ధృవీకరించినట్లు ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.
