Let's talk: editor@tmv.in
తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌లపై ఉప స‌ర్ ‘పంచ్’

తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌లపై ఉప స‌ర్ ‘పంచ్’

Gaddamidi Naveen
2 డిసెంబర్, 2025

రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌కు మొద‌టి విడ‌త నామినేష‌న్లు ముగియ‌గా, రెండో విడ‌త కొన‌సాగుతుంది.మూడో నామినేష‌న్ ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌ర్పంచ్ వార్డు స్థానాల‌కు పోటీ చేసే అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డంతో గ్రామాల్లో రాజ‌కీయం ఊపందుకుంది. ఎవ‌రి వ్యూహాల్లో వారు నిమ‌గ్న‌మై ఉన్నారు. స‌ర్పంచ్ ప‌ద‌విని ద‌క్కించుకునేందుకు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు. గ్రామాల్లో ఆయా రిజ‌ర్వేష‌న్ల‌కు చెందిన‌వారిలో త‌మ‌కు అనుకూలంగా ఉంటూ చెప్పిన మాట వినే అనుచ‌రుడిని స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా బ‌రిలోకిదింపి గెలిపించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.స‌ర్పంచ్ నుంచి వార్డు స‌భ్యుల వ‌ర‌కు అనువైన వారిని ఎంపిక చేసేందుకు గ్రామాల‌లో వివిధ పార్టీల‌కు చెందిన ముఖ్య‌నేత‌లు స‌మాలోచ‌న‌లు చేస్తూ త‌ల‌మున‌క‌లు అవుతున్నారు.

స‌ర్పంచ్, వార్డు స‌భ్యులు గెల‌వాల‌న్నా,ఉప స‌ర్పంచిగా ఎన్నుకోవాల‌న్నా ఎన్నిక‌ల్లో చేసే ఖ‌ర్చే ప్ర‌ధాన బ‌లం. ఒక్కో గ్రామంలో ఒక‌లా ఖ‌ర్చు అవుతుంది.మండ‌ల ప్రాంతానికి 50నుంచి కోటి రూపాయ‌ల వ‌రుకు మండ‌లాల‌కు దూరంగా ఉన్న ప‌ల్లెల్లో క‌నీసం రూ.10 ల‌క్షల వ‌ర‌కు ఖ‌ర్చ‌య్యే అవ‌కాశం ఉందని ఆవావ‌హులు అంచ‌నా వేసుకుంటున్నారు.

వార్డు స‌భ్యుల ఎంపిక కీల‌క‌మే

ఉప స‌ర్పంచ్ బ‌రిలో ఉండే నాయ‌కుడు వార్డుల్లో నిలిపేందుకు గెలిచేవారిని, ప్ర‌ధాన అనుచ‌రుల‌ను ఎంపిక చేసుకుంటున్నారు. ఉప స‌ర్పంచ్ కావాలంటే వార్డు స‌భ్యులే కీల‌కం కానున్నారు. దీంతో చెప్పిన మాట వినేవారితోనే నామినేష‌న్ వేయించేందుకు సిద్ధం అయ్యారు. వారికి అవ‌స‌ర‌మైన నామినేష‌న్ ప‌త్రాలు, ప‌న్నుల చెల్లింపు, ధృవ‌ప‌త్రాలు తీసుకోవ‌డం వంటి ప‌నుల‌న్నీ ఆ నాయ‌కులే చూసుకుంటున్నారు.

పంచాయతీ ఎన్నికలు

మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.రాష్ట్రంలోని గ్రామీణ గ్రామపంచాయతీ ఓటర్ల సంఖ్య సుమారు 1.67 కోట్లుగా ఉంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు విడతలుగా ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ డిసెంబర్ 11, 14,17న జరగనున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల స్వీకరణ పూర్తై, పరిశీలన జరుగుతోంది. నామినేషన్ల తిరస్కరణపై అభ్యర్థులు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.తొలి విడ‌త నామినేష‌న్లు డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఉంది. ఉపసంహరణ గడువు తర్వాతే సర్పంచ్/వార్డు మెంబర్ అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష బీఆర్ఎస్ కు, బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.