
తెలంగాణలో 14 మంది కొత్త సబ్రిజిస్ట్రార్ల నియామకం
తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్ల శాఖలో కొత్తగా నియమితులైన 14 మంది సబ్-రిజిస్ట్రార్లకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన నూతనంగా విధుల్లో చేరిన అధికారులకు ఇండియన్ స్టాంప్ యాక్ట్ పుస్తకాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. కేవలం 20 నెలల స్వల్ప వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 70,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని, ముఖ్యంగా రెవెన్యూ శాఖలో జీపీవోల నియామకం, హౌసింగ్ శాఖ విభాగంలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో సుమారు 350 మంది ఇంజినీర్లు, సర్వే విభాగంలో 3465 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. దీంతో పాటు అన్ని శాఖల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు.
నూతనంగా నియమితులైన అధికారులను ఉద్దేశించి మంత్రి మీరు నిజాయితీ, సమగ్రత క్రమశిక్షణతో కూడిన ప్రజా సేవ చేయాలి. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించడం ద్వారా ప్రజా సేవ యొక్క గౌరవాన్ని కాపాడాలి" అని పిలుపునిచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని, ఈ కీలక సమయంలో యువ అధికారుల నియామకం శాఖకు కొత్త శక్తిని ఇస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
