
తెలంగాణలో 10మంది ఐఏఎస్ అధికారుల బదిలీ.. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాష్
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ పరిపాలన (ఎస్పీఎల్-ఏ) విభాగం జి.ఓ.ఆర్.టి. నం.202 ద్వారా ఈ మార్పులను ప్రకటించింది.
పరిపాలనను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా నడిపించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మార్పుల్లో ప్రధానంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో కీలక నియామకం జరిగింది. ఇప్పటివరకు ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న జ్యోతి బుద్ధ ప్రకాష్ను సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్గా సవ్యసాచి ఘోష్ బాధ్యతలు చేపట్టనున్నారు. గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్గానూ ఆయన కొనసాగనున్నారు. పంచాయతీరాజ్ కమిషనర్గా దివ్యకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా కాత్యాయనీ దేవి బదిలీ అయ్యారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కాత్యాయనీ దేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి జేఎండీగా మయాంక్ మిట్టల్ నియమితులయ్యారు. పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. మంత్రి శ్రీధర్బాబు ఓఎస్డీగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ ఉత్తర్వులను ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు జారీ చేశారు.
