Let's talk: editor@tmv.in
తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు

తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు

Gaddamidi Naveen
29 అక్టోబర్, 2025

తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఇద్దరు అగ్ర నాయకులు దశాబ్దాల అజ్ఞాత జీవితాన్ని వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఒకరు కేంద్ర కమిటీ సభ్యులు కావడం గమనార్హం. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన నేతలు సీపీఐ (మావోయిస్టు) పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసినట్టు ఆయన ప్రకటించారు.

లొంగిపోయిన కీలక నాయకులు

పి. ప్రసాద్ రావు (64) అలియాస్ చంద్రన్న: ఈయన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన సుమారు 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 1979లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే ఈయన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్‌లో చేరారు. ప్రసాద్‌పై రూ.25 లక్షల రివార్డు ఉంది.

బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్

ఈయన మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఈయన 42 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 1983లో సీపీఐ (ఎం.ఎల్.) పీపుల్స్ వార్ పార్టీకి చెందిన రాడికల్ యూత్ లీగ్‌లో చేరారు. ఇటీవల ఈయన రాష్ట్ర కమిటీ ప్రెస్ టీం ఇన్‌ఛార్జిగా ఉండి, ప్రభాత్ పేరుతో పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. ప్రకాష్‌పై రూ.20 లక్షల రివార్డు ఉంది.

లొంగుబాటుకు కారణాలు

తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఇద్దరు సీనియర్ మావోయిస్టు నేతలు ప్రభుత్వ పిలుపునకు స్పందించి ప్రధాన స్రవంతిలోకి చేరారని తెలిపారు. వీరికి సంబంధించిన రివార్డు మొత్తాలను వీరికే అందించామని, తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం కింద అదనపు ప్రయోజనాలు కూడా పొందుతారని డీజీపీ తెలిపారు.

అలాగే ఈ ఇద్దరు నేతల లొంగిపోవడం ఇటీవల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేసిన పిలుపు ప్రభావమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అక్టోబర్ 21న మావోయిస్టులకు ఆయుధాలు వదిలి ప్రధాన ప్రవాహంలో చేరి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఇద్దరు నేతలు ఆరోగ్య సమస్యలు, భద్రతా బలగాల ఒత్తిడి, సిద్ధాంతపరమైన విభేదాలు, నాయకత్వంలో అంతర్గత విభజనలు వంటి కారణాల వల్ల మావోయిస్టు ఉద్యమం నుంచి తప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మావోయిస్టులు ఉన్నారని, వారిలో తొమ్మిది మంది రాష్ట్ర కమిటీలో ఉన్నారని, మిగిలిన వారు ప్రధానంగా ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆయన వివరించారు.అలాగే సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీలో ఉన్న 9 మందిలో 5 మంది తెలంగాణ వాసులేనని తెలిపారు. డీజీపీ మరోసారి మావోయిస్టు కార్యకర్తలకు పిలుపునిస్తూ, తమ గ్రామాలకు తిరిగి వెళ్లి కుటుంబాలతో కలసి సామాజిక జీవితంలో భాగమవ్వాలని, తెలంగాణ అభివృద్ధికి నిర్మాణాత్మకంగా తోడ్పడాలని కోరారు.

అలాగే లొంగిపోయే ప్రతి మావోయిస్టుకు ప్రభుత్వ రక్షణ, సహాయం, పునరావాసం వంటి పూర్తి మద్దతు అందిస్తామని, వారు శాంతియుతంగా, గౌరవప్రదంగా కొత్త జీవితం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని డీజీపీ భరోసా ఇచ్చారు.అలాగే మావోయిస్టు ఉద్యమంపై తెలంగాణ పోలీసులు అవలంబిస్తున్న సమగ్ర విధానానికి ఇది నైతిక విజయం, అని పేర్కొన్నారు.ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 427 మంది మావోయిస్టు కార్యకర్తలు, అందులో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, ఎనిమిది రాష్ట్ర కమిటీ సభ్యులు సహా, పోలీసుల ముందు లొంగిపోయినట్లు తెలిపారు.