
తెలంగాణలో మరో ఘోర ప్రమాదం..! ప్రైవేట్ బస్సు దగ్ధం 29 మంది క్షేమం
తెలంగాణ రాష్ట్రంలోని చేవెళ్ల బస్సు ప్రమాదం ప్రజలు మరవక ముందే రాష్ట్రంలో మరో ప్రమాదం వెలుగు చూపింది.నల్గొండ జిల్లా, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పై ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 1:45 గంటల సమయంలో చిట్యాల మండలం ప్రాంతంలో చోటుచేసుకుంది.బస్సు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని కందుకూర్ వైపు ప్రయాణిస్తోంది.
నల్గొండ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పావర్ తెలిపిన వివరాల ప్రకారం, బస్సు ఇంజన్ నుంచి పొగలు వస్తున్నట్లు డ్రైవర్ గమనించి వెంటనే వాహనాన్ని ఆపి ప్రయాణికులను బస్సు నుంచి దిగమని సూచించారు.ప్రయాణికులు బస్సు నుంచి దిగగానే,కొన్ని క్షణాల్లో బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుందని తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది.రెండు అగ్నిమాపక వాహనాలు బస్సులో మంటలను ఆర్పాయి.ఈ ఘటనలో ప్రయాణికులలో ఎవరికి కూడా గాయాలేదని అధికారులు తెలిపారు.ప్రస్తుతం ఈ అగ్నిప్రమాదానికి నిజమైన కారణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 29మంది ప్రయాణికులు,డ్రైవర్ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటకు వచ్చారని పోలీసులు తెలిపారు. నిపుణులు బస్సు లోపలి మెకానికల్ సమస్యలపై దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు సలహాలు ఇస్తున్నారు.అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.
