Let's talk: editor@tmv.in
తెలంగాణలో పెరుగుతున్న మతపరమైన ఘటనలు ఆందోళనకరం: ఎంపీ అసదుద్దీన్

తెలంగాణలో పెరుగుతున్న మతపరమైన ఘటనలు ఆందోళనకరం: ఎంపీ అసదుద్దీన్

Gaddamidi Naveen
23 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో చోటుచేసుకున్న హింసను ఆయన తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి ఎస్పీతో మాట్లాడి, హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

బాన్సువాడలో జరిగిన హింసాత్మక ఘటనలో మైనారిటీ వర్గాలకు చెందిన చిన్న దుకాణాలు, వీధి వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. శనివారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, కామారెడ్డి జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు తెలిపారు. కొద్ది గంటల్లోనే పెద్ద ఎత్తున గుంపు ఎలా సమీకరించబడిందో అనుమానాస్పదంగా ఉందని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల్లో కుడిపక్ష గుంపుల దాడులు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న ఒక నిందితుడిని కూడా కొందరు స్థానిక వ్యక్తులు కొట్టినట్లు ఆయ‌న ఆరోపించారు.

ఈ ఘటన ఒక మాల్ వద్ద ప్రారంభమైన వివాదంతో చెలరేగింది. భక్తిగీతాల ప్రసారం విషయంలో ఒక ముస్లిం వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అది రాళ్ల దాడులకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ సహా పలువురు గాయపడ్డారు. ఇప్పటివరకు 12 మందిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఓవైసీ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా ఎంఐఎం ప్రధాన కార్యదర్శి సయీద్ ఖాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని తెలిపారు. ముస్లిం యాజమాన్యంలోని దుకాణాలకు జరిగిన నష్టంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయనను ఆదేశించినట్లు చెప్పారు. హింసలో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, అవసరమైన సహాయాన్ని త్వరితగతిన అందిస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, సదాశివపేటలో మస్జిద్-ఎ-మౌలానా కూల్చివేతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భూమి యజమాని మహమ్మద్ కలీమ్ పై అనవసర వేధింపులు జరిగాయని ఆరోపించారు. రెండు సంవత్సరాలుగా ఆ భూమి తన అధీనంలో ఉండగా, బోర్‌వెల్ కూడా తవ్వించుకున్నారని చెప్పారు. షెడ్ నిర్మాణం చేపట్టిన తర్వాతే రెవెన్యూ అధికారులు అది ఇనాం భూమి అంటూ కూల్చివేత చర్యలు తీసుకోవడం అనుమానాస్పదమని ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాలుగా అధికారులు ఏమి చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, సామాజిక సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఈ సంద‌ర్భంగా ఓవైసీ పేర్కొన్నారు.