
తెలంగాణలో డిసెంబర్ 15న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ
దిగ్గజ గాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 15న రవీంద్ర భారతిలో ఆవిష్కరించనుంది. శనివారం ఎస్పీబీ బావమరిది, సీనియర్ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం అందజేశారు. రవీంద్రభారతిలో విగ్రహం పెట్టే నిర్ణయం తీసుకున్నందుకు సుధాకర్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. నవంబర్ 27న పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సుధాకర్తో కలిసి రవీంద్రభారతి వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ విషయాన్ని మంత్రి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. నెల్లూరు జిల్లాలో జన్మించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడిన అపూర్వ గాయకుడు. నటుడు, సంగీత దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. 2020లో కోవిడ్-19 సమస్యలతో ఆయన కన్నుమూశారు.
