Let's talk: editor@tmv.in
తుది దశకు భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం!

తుది దశకు భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం!

Sriramoju Sreeja
30 అక్టోబర్, 2025

భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న చర్చలు ఇప్పుడు సానుకూల మలుపు తిరిగాయి. అక్టోబర్ 27-28 తేదీల్లో భారత వాణిజ్య, పారిశ్రామిక మంత్రి పీయూష్ గోయల్ బ్రస్సెల్స్‌ను సందర్శించిన అనంతరం, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్ మాట్లాడుతూ, బ్రస్సెల్స్‌లో జరిగిన 14వ దశ చర్చల్లో “ముఖ్యమైన పురోగతి” సాధించామని తెలిపారు. ఆయన పేర్కొన్నదేమంటే, ఇరు పక్షాలు నిరంతర చర్చా ప్రక్రియలో ఉన్నాయని, ఈ సంవత్సరం చివరినాటికి ఒప్పందాన్ని తుది రూపం దిద్దుకోవడమే లక్ష్యమని చెప్పారు.

రాయబారి డెల్ఫిన్, యూరోపియన్ ట్రేడ్, ఎకానమిక్ సెక్యూరిటీ కమిషనర్ మారోస్ షెఫ్కోవిచ్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ, మంత్రి గోయల్‌తో “అత్యంత ఫలప్రదమైన” సమావేశాలు జరిగాయని తెలిపారు. “యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేయాలన్న సామూహిక లక్ష్యాన్ని పంచుకుంటున్నాం” అని షెఫ్కోవిచ్ అన్నారు. “మేము పలు రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించాం. సాంకేతిక సుంకాల బృందం తుది చర్చల కోసం త్వరలోనే న్యూఢిల్లీకి వెళ్తుంది. సుంకాల కంటే మించి, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను మరింత సులభతరం చేసే చర్యలపై కూడా మేము పురోగతి సాధించాం” అని తెలిపారు.

మంత్రి గోయల్ ఈ పర్యటనను “అత్యంత ఫలప్రదంగా” వర్ణించారు. ఆయన ఈ చర్చలు ఇరు పక్షాలకు “విన్-విన్ ఒప్పందం”కు పునాది వేశాయని, ప్రధాని మోడీ, యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పంచుకున్న భాగస్వామ్య సుసంపన్నత, ఆవిష్కరణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఉపాధి సృష్టి అనే దృష్టికోణాన్ని సాధించడానికి భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

మంత్రి పీయూష్ గోయల్ బ్రస్సెల్స్ పర్యటనలో భాగంగా జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెఫుల్‌తో కూడా సమావేశం కావడం, ఈ ఒప్పందానికి జర్మనీ ఇస్తున్న వ్యూహాత్మక ప్రాధాన్యతను సూచిస్తుంది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పర్యటన చర్చలకు రాజకీయ, వ్యూహాత్మక దిశను ఇవ్వడమే లక్ష్యంగా చేపట్టబడింది.

చారిత్రక నేపథ్యం

భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఆలోచన కొత్తది కాదు. 2007లో మొదటిసారి చర్చలు ప్రారంభమయ్యాయి. కానీ సుమారు 15 రౌండ్‌ల తర్వాత, 2013లో మార్కెట్ యాక్సెస్, సుంకాల స్వేచ్ఛపై విభేదాల కారణంగా ఆగిపోయాయి. 2022 జూన్‌లో, ఎనిమిది సంవత్సరాల విరామం తర్వాత చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి.

యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, భారత్ యూరప్‌కు వేగంగా ఎదుగుతున్న ప్రధాన మార్కెట్‌గా ఉంది. ఈ ఒప్పందం కుదిరితే భారతీయ ఉత్పత్తులు, సేవలకు యూరోపియన్ మార్కెట్లో పెద్ద అవకాశాలు లభిస్తాయని, అలాగే యూరోపియన్ కంపెనీలు భారత మార్కెట్‌లో మరింత బలమైన స్థితిని పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు. సుంకాలకే పరిమితం కాకుండా, ఇరు పక్షాలు నియంత్రణ సహకారం, పెట్టుబడి రక్షణ, భౌగోళిక సూచికలు వంటి అంశాలపై కూడా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం కుదిరితే కలిగే ప్రయోజనాలు

భారత ఎగుమతులైన దుస్తులు, ఔషధాలు, ఉక్కు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ యంత్రాలకు యూరోపియన్ మార్కెట్‌లోకి మెరుగైన ప్రవేశం లభిస్తుంది. అలాగే యూరోపియన్ ఉత్పత్తిదారులకు భారత్‌లో తమ వస్తువులపై విధించే దిగుమతి సుంకాలను తగ్గించుకునే అవకాశం లభిస్తుంది. ఉదాహరణకు వాహనాలు, వైద్య పరికరాలు, వైన్, స్పిరిట్స్ వంటి ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయి. ద్వైపాక్షిక పెట్టుబడులను బలోపేతం చేస్తుంది. పెట్టుబడిదారులకు స్థిరత్వం, నమ్మకాన్ని అందిస్తుంది. ముఖ్యంగా భారతదేశానికి కీలకమైన ఐటీ, బిజినెస్ సర్వీసెస్ రంగాల్లో వాణిజ్యాన్ని ఈ ఒప్పందం సులభతరం చేస్తుంది. వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికుల కదలికను సులభతరం చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. అయితే వీసా, వర్క్ పర్మిట్ నిబంధనలు ఈయూ సభ్య దేశాల జాతీయ అధికార పరిధిలో ఉంటాయి కాబట్టి ఇది సున్నితమైన అంశంగానే ఉంటుంది. సరఫరా గొలుసుల వైవిధ్యీకరణ, వ్యూహాత్మక స్థిరత్వం, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు దోహదపడుతుంది.

బ్రస్సెల్స్‌లో అక్టోబర్ 6-10 మధ్య ముగిసిన 14వ దశ చర్చల్లో నిలిచిపోయిన అంశాల సంఖ్య తగ్గిందని అధికారిక వర్గాలు తెలిపాయి. యూరోపియన్ సుంకాల సాంకేతిక బృందం త్వరలో న్యూఢిల్లీకి రానుంది. ఇరు పక్షాలు ఈ సంవత్సరం చివరినాటికి ఒప్పందాన్ని పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నాయి.

అయితే ఆటోమొబైల్స్, పాడి ఉత్పత్తులు, వ్యవసాయ వస్తువులపై సుంకాల తగ్గింపు, నాన్-టారిఫ్ అడ్డంకులు, సేవల ప్రాప్యత, పెట్టుబడి రక్షణ, నియంత్రణ అనుసరణ, స్థిరమైన అభివృద్ధి ప్రమాణాలపై ఇంకా సున్నితమైన విభేదాలు మిగిలి ఉన్నాయని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఈ సంవత్సరం చివరినాటికి ఒప్పందం కుదరాలంటే, ఇరుపక్షాల నుండి బలమైన రాజకీయ చొరవ, సామరస్య వైఖరి అవసరమని పరిశీలకులు వారు సూచిస్తున్నారు.

తుది దశకు భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం! - Tholi Paluku