Let's talk: editor@tmv.in
తిరుపతిలో ‘హై అలర్ట్’

తిరుపతిలో ‘హై అలర్ట్’

FL - SUNL
4 అక్టోబర్, 2025

టెంపుల్ టౌన్ తిరుపతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుళ్లకు పాల్పడతామంటూ ఈమెయిల్ రావడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. రంగంలోకి దిగిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని వెల్లడించాయి. భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

తిరుపతిని తాకిన సెగ

తమిళనాడులో ప్రముఖులకు వచ్చిన బాంబు బెదిరింపుల సెగ తిరుపతిని తాకింది. చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్, నటి త్రిష ఇళ్లకు బెదిరింపు కాల్స్ రాగా... తిరుపతిలోనూ పేలుళ్లకు పాల్పడతామంటూ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో, తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ పరిణామం నగరంలో కాస్త ఉత్కంఠకు దారితీసింది. పోలీసు ప్రత్యేక బృందాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో కలిసి తిరుపతి రైల్వే స్టేషన్, లింకు బస్ స్టాండ్, విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయం వంటి ఆరు కీలక ప్రాంతాల్లో సుమారు రెండు గంటల పాటు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టారు. ప్రయాణికుల లగేజీని, అనుమానాస్పదంగా ఉన్న వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు.

ముందు జాగ్రత్తగా హై అలర్ట్

ఈ తనిఖీల్లో ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు గానీ, అనుమానాస్పద కార్యకలాపాలు గానీ గుర్తించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నగరంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశామని అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి వచ్చే యాత్రికులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. తనిఖీలు నిర్వహించడంతోపాటు ముందు జాగ్రత్తగా హై అలర్ట్ విధించినట్లు వెల్లడించారు.

తిరుపతిలో ‘హై అలర్ట్’ - Tholi Paluku