
తిమోర్ లెస్టేకు భారత రాయబారిగా ఎం.ఎస్. పాటియాల్ నియామకం
తిమోర్-లెస్టే (తూర్పు తీమోర్) దేశానికి భారతదేశం తరఫున కొత్త రాయబారిగా ఎం.ఎస్. పాటియాల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఎం.ఎస్. పాటియాల్ 2007 బ్యాచ్ ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి. ప్రస్తుతం ఆయన ట్యునీషియాలోని భారత రాయబార కార్యాలయంలో పని చేస్తున్నారు. త్వరలోనే డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ తిమోర్ లెస్టే రాజధాని దిలిలో తన బాధ్యతలు స్వీకరించనున్నారు.
భారత్-తిమోర్ లెస్టే సంబంధాలు
భారత్-తిమోర్ లెస్టే దేశాలు ప్రజాస్వామ్యం, భిన్నత్వం, విభిన్న సంస్కృతులను గౌరవించడం వంటి సాధారణ సూత్రాలను నమ్ముతాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య స్నేహం చాలా బలంగా ఉంది. తిమోర్ లెస్టే స్వాతంత్య్రం పొందిన ప్రారంభంలోనే దానితో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న దేశాలలో భారత్ ఒకటి. 2002 మే నెలలో జరిగిన తిమోర్ లెస్టే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అప్పటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం హాజరైంది. భారత్-తిమోర్ లెస్టే మధ్య అధికారికంగా దౌత్య సంబంధాలను ఏర్పాటు చేసే ఒప్పందం 2003 జనవరి 24న కుదిరింది. అప్పటి నుంచి రెండు దేశాలు ద్వైపాక్షికంగా, ప్రాంతీయంగా, అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితిలో సహకారం
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలనే ప్రతిపాదనను తిమోర్ లెస్టే బలపరుస్తుంది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని 2003లోనే ఐరాస సాధారణ సభలో ప్రకటించారు. 2011-12, 2021-22 సంవత్సరాల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అభ్యర్థిత్వానికి కూడా తిమోర్ లెస్టే మద్దతు ఇచ్చింది. అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ఐరాస సాధారణ సభలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని తిమోర్ లెస్టే కూడా సమర్థించింది.
తిమోర్ లెస్టేలో భారత ఎంబసీ
2023 సెప్టెంబర్ 7న ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, తిమోర్ లెస్టేలో భారత రెసిడెంట్ మిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా 2024 సెప్టెంబర్ 5న దిలి నగరంలో భారత కొత్త రాయబార కార్యాలయం ప్రారంభమైంది. 2024 అక్టోబర్లో తిమోర్ లెస్టే కూడా న్యూఢిల్లీలో తన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించింది.
అభివృద్ధి సహకారం
భారత్, తిమోర్ లెస్టే దేశానికి ఆరోగ్యం, సాంకేతిక శిక్షణ, సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహాయం చేస్తోంది. భారత్-యుఎన్ అభివృద్ధి భాగస్వామ్య నిధి, ఐబీఎస్ఏ ఫండ్ ద్వారా పలు అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేస్తోంది. కొత్త రాయబారిగా ఎం.ఎస్. పాటియాల్ బాధ్యతలు స్వీకరించనుండటంతో భారత్-తిమోర్ లెస్టే మధ్య సంబంధాలు మరింత బలపడతాయని దౌత్య వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
