
తెలుగు పునర్వైభవానికి కృషి చేస్తా!
తెలుగు, సంస్కృత భాషల పరిరక్షణకు అకాడమీ ద్వారా కృషి చేస్తానని తెలుగు, సంస్కృత భాషల అకాడమీ ఛైర్మన్ ఆర్డీ విల్సన్ అన్నారు. తెలుగు, సంస్కృత భాషల అకాడమీ ఆధ్వర్యంలో తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ శ్రీ. ఆర్డీ విల్సన్ (శరత్ చంద్ర)తో సంపాదక, రచయితలు, భాషాభిమానుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. సామాజిక రంగంలోనే కాకుండా సాహిత్యంలో తనదైన ముద్రను వేసి, వెనుకబడిన బలహీన పేద బడుగు వర్గాల హక్కుల సాధనకై అనేక ఉద్యమాలు చేపట్టడమే కాకుండా, తన రచనలతో వార్తా పత్రికల ద్వారా తనదైన శైలిలో సమాజంలో అనేక అంశాలపై గళమెత్తిన సంఘ సంస్కర్త ఆర్.డి. విల్సన్ అని సంపాదకులు కొనియాడారు.
అనంతరం ఆర్డీ విల్సన్ మాట్లాడుతూ తెలుగు భాషపై, సాహిత్యంపై తనకున్న మక్కువతో వైద్య రంగాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నా తాను మాత్రం సాహిత్యం వైపే అడుగేసి సమాజాభివృద్ధికి దోహద పడే అనేక నవలలు, కథలు, నాటకాలు రచించానని తెలిపారు. అంతే కాకుండా సమాజంపై ఉన్న బాధ్యతతో సమకాలిక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో పత్రికా విలేకరిగా కూడా పనిచేశానని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తెలుగు భాష ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోనున్నదని, తెలుగు భాషా పరిరక్షణకు తెలుగు, సంస్కృత భాషల అకాడమీ ద్వారా కృషి చేస్తామని హామి ఇచ్చారు. తెలుగు భాషా సౌందర్యం మాట్లాడంలో, సాహిత్యం చదవడంలో ఇమిడి ఉందన్నారు.
కులానికి, మతానికి భాషను ఆపాదించవద్దని కోరారు. నడుస్తున్న చరిత్రకు సాహిత్యం ఒక సాక్షి అని అలాంటి సాహిత్యాన్ని కనుమరుగవ్వకుండా పరిరక్షించుకోవాలని సూచించారు. తెలుగు, సంస్కృత అకాడమీలో పనిచేసే ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరిస్తూ, విద్యార్థులకు ఈ అకాడమీ ద్వారా మరిన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పచెప్పిన కూటమి ప్రభుత్వానికి ఆర్డీ విల్సన్ ధన్యవాదాలు తెలియచేసారు.
కలెక్టర్ల సమావేశం కారణంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి రావాలని ఉన్నా రాలేకపోతున్నానని, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఆర్డీ విల్సన్ ను వైద్య, కుటుంబ సంక్షేమం, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఫోన్లో అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు , ఆదోని శాసన సభ్యులు పార్థసారథి, స్వఛ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, ఏపీ లైబ్రరీ అసోసియేషన్ చైర్మన్ కోటేశ్వర రావు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్, ఇతర అసోసియేషన్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
