
తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం: ఏపీ హోం మంత్రి అనిత
కల్పిత వీడియోల ద్వారా చాలా మంది ఇబ్బంది పెడుతున్నారని.. అలాంటి వాటిని ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ మధ్య కాలంలో ఉత్తర్ప్రదేశ్లో ఓ లారీపై రాళ్లు వేసిన వీడియోను.. ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లు వైసీపీ ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు వార్తలను ఏపీ పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని తెలిపారు. టెక్నాలాజీ ఉపయోగించి తప్పుడు వార్తలు స్ప్రెడ్ కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ నూతన కార్యాలయాన్ని హోంమంత్రి అనిత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తుళ్లూరు పోలీస్ సబ్ డివిజన్ కొత్త ఆఫీస్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని, దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అన్నారు. 2014లో సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణం ప్రారంభించారని గుర్తుచేశారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యాలయం పూర్తి కాకుండా ఉందని తెలిపారు. రాజధాని కొరకు రైతులు ఉచితంగా భూములు త్యాగం చెయ్యడం గొప్ప విషయమన్నారు. అమరావతి రైతుల కష్టం, ప్రతి ఫలమే ఇవాళ అందరూ చూస్తునారని హోంమంత్రి అన్నారు. ఈ బిల్డింగ్ పూర్తి చేయడానికి ఎస్పీ వకుల్ జిందల్, డీఎస్పీ మురళీ కృష్ణ చాలా కృషి చేశారని కొనియాడారు.
పోలీస్ వ్యవస్థను బాగా బలోపేతం చేసేందుకు డీజీపీ కృషి చేస్తున్నారని హోం మంత్రి అనిత తెలిపారు. పోలీసులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. పోలీసులకు కోటి రూపాయలు వరకు బీమా కల్పించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే 6,100 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. పోలీసు చనిపోతే వారి కుటుంబానికి అండగా ఉంటామని, బీమా ద్వారా కనిష్టంగా రూ.15 లక్షలు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఈ సబ్ డివిజన్లో సిబ్బంది కొరత ఉందని, త్వరలో అన్నీ పూర్తి చేస్తామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.
