
ఢిల్లీ బైకర్ మృతి కేసులో తీవ్రమైన జాప్యం జరుగుతోంది: న్యాయవాది
పశ్చిమ ఢిల్లీలోని జనక్పురిలో 15 అడుగుల లోతైన గుంతలో పడి బైకర్ కమల్ ధ్యానీ మృతి చెందిన ఘటనలో, ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, అలాగే పోలీసుల దర్యాప్తులో అనవసర జాప్యం జరుగుతోందని మృతుడి కుటుంబం తరపు న్యాయవాది ఆరోపించారు. డీజేబీ నిర్మాణ పనుల కోసం తవ్విన ఆ గుంత వాస్తవానికి దాదాపు 20 అడుగుల లోతు ఉండగా, అక్కడ సరైన కవరింగ్, బారికేడ్లు లేదా హెచ్చరిక బోర్డులు లేవని కుటుంబం తరఫున వాదిస్తున్న న్యాయవాది ఆస్తా చతుర్వేది తెలిపారు. అలాగే కీలకమైన సీసీటీవీ ఫుటేజీ సేకరణలో కూడా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
ఢిల్లీ జల్ బోర్డు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ ప్రాంతంలో ఎలాంటి హెచ్చరిక సూచికలు, రిఫ్లెక్టర్లు కానీ లైటింగ్ గానీ ఏర్పాటు చేయలేదని చతుర్వేది చెప్పారు. జనక్పురి ప్రాంతమంతా గుంతలు, పాడైన రహదారులు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై డీజేబీతో పాటు సంబంధిత కాంట్రాక్టర్పై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసినట్లు న్యాయవాది తెలిపారు. అయితే ఇప్పటివరకు ఎవరినైనా సస్పెండ్ చేసిన విషయమై కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆమె చెప్పారు. దర్యాప్తు వేగంపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. సంఘటన జరిగి 24 గంటలకుపైగా గడిచినా, ఇప్పటికీ సీసీటీవీ ఫుటేజీ అందించలేదు. రికార్డింగ్స్ ఇవ్వకపోతే ప్రమాదం ఎలా జరిగిందో ఎలా తెలుసుకోగలం? అని ప్రశ్నించారు.
కైలాష్పురి నివాసి అయిన కమల్ ధ్యానీ, గురువారం రాత్రి రోహిణిలోని తన కార్యాలయం నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం ఓ దారిచూపిన వ్యక్తి సమాచారం ఇవ్వడంతో, గుంతలో అతని మృతదేహం, బైక్ను పోలీసులు గుర్తించారు.
కమల్ ద్వితీయ సోదరుడు కరణ్ ధ్యానీ మాట్లాడుతూ, రాత్రంతా తమ సోదరుడిని వెతుకుతూ డాబ్రీ, వికాస్పురి, సాగర్పూర్ పోలీస్ స్టేషన్లకు వెళ్లినా, సరైన సహాయం అందలేదని ఆరోపించారు. నా సోదరుడు చనిపోయి 24 గంటలు దాటినా, పోలీసులు ఇంకా కెమెరాల కోసం వెతుకుతున్నామంటున్నారు. ఇది డీజేబీతో పాటు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. తమ కుటుంబానికి త్వరితగతిన న్యాయం కావాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రమాదం తరువాతే స్పందించారు
జనక్పురి నివాసి జస్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన తర్వాతే భద్రతా చర్యలు చేపట్టారని ఆరోపించారు. ఇది ఒక్కరోజు సమస్య కాదు. నాలుగు నెలలుగా ఇక్కడ గుంతలు, నిర్మాణ వ్యర్థాలు అలాగే ఉన్నాయి. బాలుడు చనిపోయిన తర్వాతే బారికేడ్లు పెట్టారని ఆయన చెప్పారు. పశ్చిమ విహార్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై నెలల తరబడి గుంతలు ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, పాఠశాల పిల్లలు సహా స్థానికులు పొడవైన మార్గాలు ఉపయోగించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. ఇప్పుడు కనిపిస్తున్న హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు అన్నీ ప్రమాదం తర్వాత హడావుడిగా పెట్టినవే అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా ఈ కేసులో ఉపకాంట్రాక్టర్ రాజేశ్ ప్రజాపతిని ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రమాదం జరిగిన గంటల ముందే అతనికి సమాచారం అందినప్పటికీ, అతడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. శుక్రవారం జనక్పురి పోలీస్ స్టేషన్లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కింద కాంట్రాక్టర్తో పాటు సంబంధిత డీజేబీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
బాధ్యతలేని అధికారులే అసలు నిందితులు: రాహుల్ గాంధీ
పశ్చిమ ఢిల్లీ జనక్పురిలో ఢిల్లీ జల మండలి (డీజేబీ) తవ్విన గుంతలో బైక్ పడిపోవడంతో 25 ఏళ్ల కమల్ ధ్యానీ మృతి చెందిన ఘటనను కాంగ్రెస్ నాయకుడు, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను దేశంలో వ్యాప్తి చెందిన లోభం, నిర్లక్ష్యానికి నిదర్శనంగా అభివర్ణిస్తూ, ఇది ప్రమాదం కాదని, హత్య అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో లోభం, నిర్లక్ష్యం అనే మహమ్మారి మరో యువ ప్రాణాన్ని బలితీసుకుంది. ఒక కుమారుడు, ఒక కల, తల్లిదండ్రుల సమస్త లోకం క్షణాల్లోనే నాశనం అయింది. ఇది ప్రమాదం కాదు, ఇది హత్య. బాధ్యత నుంచి తప్పించుకునే అధికారమే ఇక్కడ హంతకుడు. రహదారి కాదు, బాధ్యతలేని అధికారులే అసలు నిందితులు. ఇక్కడ ఎవరూ రాజీనామాలు చేయరు, ఎవరికి శిక్షలు ఉండవు, ఎవరి మనస్సు కదలదని పేర్కొన్నారు. ఇండోర్లో కలుషిత నీరు, నోయిడాలో యువరాజ్ ప్రాణాలు తీసిన రహదారి, కూలుతున్న వంతెనలు, ఢీకొంటున్న రైళ్లు, ఊపిరాడనీయని కాలుష్యం వంటి ఘటనలను ప్రస్తావిస్తూ ‘ఇక్కడ ఎవరికీ బాధ్యత లేదు’అనే పరిస్థితి కొనసాగుతున్నంతకాలం లోభం అనే మహమ్మారి మరిన్ని ప్రాణాలను బలితీసుకుంటూనే ఉంటుందని అన్నారు.
ఈ ఘటనపై స్పందించిన శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్, అతి తొందరపాటు నిర్మాణాలు, అవినీతిని తీవ్రంగా విమర్శించారు. అన్నీ అతి నిర్లక్ష్యంగా, తొందరపాటులోనే నిర్మిస్తున్నారు. వంతెనలు కూలిపోతున్నాయి. ఇది ఒక్క చోటే కాదు, దేశమంతటా ఇదే పరిస్థితి. అవినీతి నిధులను తినేస్తోంది. ఇదేనా మీ అభివృద్ధి చెందిన భారతదేశం? అని ప్రశ్నించారు. కమల్ స్నేహితుడు కూడా పోలీసుల స్పందనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అత్యవసరతను పట్టించుకోలేదని, కమల్ మొబైల్ ఫోన్ లొకేషన్ను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు.
