Let's talk: editor@tmv.in
ఢిల్లీ ఓపెన్‌: సుమిత్ నగల్‌ పోరాటం ముగిసె

ఢిల్లీ ఓపెన్‌: సుమిత్ నగల్‌ పోరాటం ముగిసె

Shaik Mohammad Shaffee
20 ఫిబ్రవరి, 2026

దేశ రాజధానిలో జరుగుతున్న ఏటీపీ ఢిల్లీ ఓపెన్‌లో భారత స్టార్‌ ఆటగాడు సుమిత్‌ నగల్‌ కథ ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో నగల్ 4-6, 4-6 తేడాతో ఇటలీకి చెందిన ఆరో సీడ్ ఫెడెరికో సినా చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 297వ స్థానంలో ఉన్న నగల్‌పై 18 ఏళ్ల కుర్రాడు సినా (225వ ర్యాంక్) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గంటా 40 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో నగల్ రెండో సెట్‌లో అద్భుతంగా పుంజుకుని మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడినప్పటికీ, అంతిమంగా విజయం మాత్రం సినానే వరించింది. "గ్రాండ్‌స్లామ్‌ మెయిన్ డ్రాలో ఆడిన నగల్‌పై విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది" అని సినా మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.

డబుల్స్‌లో టాప్ సీడ్ల జోరు

సింగిల్స్‌లో నిరాశ ఎదురైనా, డబుల్స్‌లో భారత్‌కు శుభవార్త అందింది. టోర్నీ టాప్ సీడ్ జంట సిద్ధాంత్ బంతియా (భారత్)-అలెగ్జాండర్ డోన్‌స్కీ (బల్గేరియా) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. తొలి రౌండ్‌లో వీరు 6-2, 6-3తో ఫ్రాన్సిస్ కేసీ అల్కాంటారా-కోర్ట్నీ జాన్ లాక్ జంటపై ఏకపక్ష విజయం సాధించారు. తమ మధ్య ఉన్న సమన్వయం ఈ విజయానికి కారణమని, గత ఏడాది అనుభవం ఇప్పుడు కలిసొచ్చిందని సిద్ధాంత్ సంతోషం వ్యక్తం చేశాడు. మరోవైపు వైల్డ్‌ కార్డ్‌తో బరిలోకి దిగిన భారత జంట దివిజ్ శరణ్-కరణ్ సింగ్ కూడా 7-6(5), 6-4తో కుజ్మానోవ్-యెవ్సేవ్ జంటను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.

ప్రధాన మ్యాచ్‌ల ఫలితాలు

ఇతర మ్యాచ్‌ల్లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జే క్లార్క్ (3వ సీడ్), ఆలివర్ క్రాఫోర్డ్ (5వ సీడ్), జపాన్‌కు చెందిన రియో నోగుచి (8వ సీడ్) వరుస సెట్లలో విజయాలు సాధించి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. రెండో సీడ్ జపాన్ ఆటగాడు రే సకామోటో తొలి సెట్ కోల్పోయినా, అద్భుతంగా పుంజుకుని 1-6, 6-1, 6-4తో అలిస్టర్ గ్రేపై విజయం సాధించాడు. అయితే, ఏడో సీడ్ పోలాండ్ ఆటగాడు డేనియల్ మిచల్‌స్కీ మాత్రం బెల్జియంకు చెందిన మైఖేల్ గీర్ట్స్ చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

చరిత్రలో భారత్

ఢిల్లీ ఓపెన్ చరిత్రలో ఇప్పటివరకు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ మాత్రమే సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. ఆయన 2014, 2015లో వరుసగా రెండుసార్లు టైటిళ్లను గెలుచుకున్నారు. ఇక డబుల్స్‌లో 2015లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ జంట, 2016లో యూకీ బాంబ్రీ-మహేష్ భూపతి జంటలు ట్రోఫీలను ముద్దాడి భారత్ గర్వపడేలా చేశాయి. తాజా టోర్నీలో సిద్ధాంత్ బంతియా, దివిజ్ శరణ్ జంటలపైనే ఇప్పుడు భారత అభిమానుల ఆశలు ఉన్నాయి.