Let's talk: editor@tmv.in
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 100కుపైగా గుడిసెలు దగ్ధం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 100కుపైగా గుడిసెలు దగ్ధం

Pinjari Chand
6 మార్చి, 2026

ఢిల్లీలోని రితాలా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుని 100కుపైగా గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 17 ఏళ్ల బాలిక మృతిచెందింది. మంటల్లో చిక్కుకున్న ఆమె కాలిపోయిన మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది అవశేషాల మధ్య నుంచి వెలికి తీశారు. అధికారుల సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 4.15 గంటలకు ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందింది. గుడిసెలు దగ్గర దగ్గరగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి అక్కడ నివసిస్తున్న ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగించాయి. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు హుటాహుటిన బయటకు పరుగులు తీశారు.

ఈ గుడిసెల కాలనీలో ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు నివసిస్తున్నారని స్థానికులు తెలిపారు. వారు సమీపంలోని ఫ్యాక్టరీలు, నిర్మాణ స్థలాలు, చిన్న వ్యాపార సంస్థల్లో రోజువారీ కూలీగా పని చేస్తుంటారు. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్‌‌ సర్వీస్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 18కు పైగా ఫైర్ టెండర్లు మోహరించాయి.

గుడిసెలు ఒకదానికొకటి చాలా దగ్గరగా నిర్మించడంతో పాటు వాటిలో ప్లాస్టిక్ షీట్లు, కలప పలకలు, వస్త్రాలు వంటి అత్యంత మండే స్వభావమున్న పదార్థాలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కలిసి రక్షణ చర్యలు చేపట్టి ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో 100కుపైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. అదనంగా సమీపంలోని కాగిత రోల్స్, కార్డ్‌బోర్డ్ నిల్వ చేసిన గోదాముకు కూడా మంటలు అంటుకున్నాయి. కొన్ని నివాస ఫ్లాట్ల తలుపులు, కిటికీలు కూడా దెబ్బతిన్నాయి.

మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అవశేషాల మధ్య నుంచి 17 ఏళ్ల బాలిక కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం బీఎస్‌ఏ హస్పిటల్‌కు తరలించారు. ఆమెను ఇప్పటికే గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాద సమయంలో అనేక కుటుంబాలు తమ వద్ద ఉన్న వస్తువులను తీసుకునే సమయం లేకుండా బయటకు పరుగులు తీయాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు.

బీహార్‌కు చెందిన కార్మికుడు రమేష్ కుమార్ మాట్లాడుతూ, మంటలు మొదలయ్యాక ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు పరుగెత్తాం. కొద్ది నిమిషాల్లోనే మా గుడిసె, బట్టలు, డబ్బు, పత్రాలు అన్నీ బూడిదైపోయాయని వేదన వ్యక్తం చేశాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మరో మహిళ మాట్లాడుతూ అరుపులు విని లేచేసరికి చుట్టూ మంటలు కనిపించాయి. పిల్లలను బయటకు తీసుకువచ్చాం కానీ గుడిసెలో ఉన్న ఏ వస్తువూ కాపాడలేకపోయామని తెలిపింది. అగ్నిప్రమాదంతో ఇళ్లు కోల్పోయిన అనేక మంది వలస కూలీలు తమ గుడిసెల అవశేషాల్లో ఉపయోగపడే వస్తువుల కోసం వెతుకుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. 100కుపైగా గుడిసెలు దగ్ధం - Tholi Paluku