Let's talk: editor@tmv.in
డ్రోన్‌ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకుంటున్నాం: సీఐఎస్‌ఎఫ్​

డ్రోన్‌ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకుంటున్నాం: సీఐఎస్‌ఎఫ్​

Pinjari Chand
6 మార్చి, 2026

దేశంలోని కీలక స్థావరాలపై జరిగే డ్రోన్‌, సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్​)డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. గురువారం సీఐఎస్‌ఎఫ్​ 57వ స్థాపన దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 2026–30 ఆధునికీకరణ ప్రణాళికలో భాగంగా డ్రోన్‌, యాంటీ-డ్రోన్ శిక్షణను విస్తృతంగా చేపడతామని చెప్పారు. రాజస్థాన్‌లోని బెహ్రోర్‌లో డ్రోన్ శిక్షణ కేంద్రాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. డ్రోన్ ఆపరేషన్‌, యాంటీ డ్రోన్ వ్యవస్థలపై శిక్షణ ఇవ్వడానికి రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఆర్‌‌పీటీవో) ఏర్పాటుకు హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు.

దేశంలోని ముఖ్యమైన స్థావరాలపై గగనతల ముప్పులను గుర్తించి ఎదుర్కొనే నోడల్ ఏజెన్సీగా సీఐఎస్‌ఎఫ్​ ను నియమించినట్లు కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అన్ని రంగాలు సైబర్ ముప్పులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్​ సైబర్ భద్రతా సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటోందని చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే కొంతమంది సైబర్ కమాండోలను తయారు చేసినట్లు తెలిపారు.

రూ.819 కోట్ల ఆధునికీకరణ ప్రణాళిక

2026–30 ఆధునికీకరణ ప్రణాళికలో భాగంగా సీఐఎస్‌ఎఫ్​ మొత్తం 76 అంశాలను గుర్తించింది. ఇందుకోసం సుమారు రూ.819 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందులో డ్రోన్ పరిష్కారాలపై శిక్షణ, సమగ్ర సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, ప్రత్యేక డేటా సెంటర్, జీరో ట్రస్ట్ నెట్‌వర్క్ ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి.

స్థాపన దినోత్సవ వేడుకలకు అమిత్ షా

సీఐఎస్‌ఎఫ్​ 57వ స్థాపన దినోత్సవ వేడుకలకు అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఒడిశాలోని ముండాలి యూనిట్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కోల్‌కతాలోని రాజర్‌హాట్‌లో రూ.72.46 కోట్లతో నిర్మించిన నివాస సముదాయం, ఢిల్లీలోని మైదాన్ గర్హీలో రూ.253.10 కోట్లతో నిర్మించిన గృహ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే అసోంలోని నగర్బేరా, మహారాష్ట్రలోని నాసిక్‌, మధ్యప్రదేశ్‌లోని సీహోర్ ప్రాంతాల్లో కొత్త రిజర్వ్ బెటాలియన్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

దేశవ్యాప్తంగా కీలక స్థావరాలకు భద్రత

ప్రస్తుతం రెండు లక్షల మంది సిబ్బందితో సీఐఎస్‌ఎఫ్​ దేశంలోని 25 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 361 కీలక స్థావరాలకు భద్రత కల్పిస్తోంది. ఇందులో 71 విమానాశ్రయాలు, ఢిల్లీ మెట్రో, 105 విద్యుత్ కేంద్రాలు, 18 అణు కేంద్రాలు, 15 సముద్ర నౌకాశ్రయాలు, 36 చమురు, సహజవాయు కేంద్రాలు, 17 ఉక్కు కర్మాగారాలు, 10 బొగ్గు గనులు, కేంద్ర ప్రభుత్వ ముఖ్య మంత్రిత్వ శాఖల భవనాలు ఉన్నాయి. సీఐఎస్‌ఎఫ్​ ప్రత్యేక భద్రతా విభాగం ప్రస్తుతం 156 మంది ప్రముఖులకు భద్రత కల్పిస్తోంది.

సిబ్బంది బలోపేతం

దేశంలోని కీలక మౌలిక సదుపాయాల భద్రతను బలోపేతం చేయడానికి సీఐఎస్‌ఎఫ్​ సిబ్బంది సంఖ్యను 2 లక్షల నుంచి 2.2 లక్షలకు పెంచినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ప్రతి సంవత్సరం సుమారు 14,000 మంది కొత్త సిబ్బందిని నియమించనున్నారు.

డ్రోన్‌ దాడులను ఎదుర్కొనే సామర్థ్యం పెంచుకుంటున్నాం: సీఐఎస్‌ఎఫ్​ - Tholi Paluku