Let's talk: editor@tmv.in
డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: ఖర్గే

డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: ఖర్గే

Pinjari Chand
13 ఏప్రిల్, 2026

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై సమగ్ర చర్చ జరగాలంటే ముందుగా డీలిమిటేషన్‌పై వివరాలు వెల్లడించాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి తెలిపారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత, అంటే ఏప్రిల్‌ 29 తర్వాత ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ అధినియం)పై చర్చించేందుకు ఏప్రిల్‌ 16 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని పంపిన లేఖకు ప్రతిస్పందనగా ఖర్గే ఈ లేఖ రాశారు. డిలిమిటేషన్‌ వివరాలు వెల్లడించకుండా ఈ చట్టంపై ప్రయోజనకరమైన చర్చ జరగడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు.

2023 సెప్టెంబర్‌లో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించిన సమయంలోనే కాంగ్రెస్ తరఫున వెంటనే అమలు చేయాలని తాము డిమాండ్ చేశామని ఖర్గే గుర్తుచేశారు. అయితే అప్పటినుంచి దాదాపు 30 నెలలు గడిచినా ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదని విమర్శించారు. ఇప్పుడీ చట్టంపై చర్చ కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతున్నప్పటికీ, డీలిమిటేషన్‌ ఎలా జరగనుందనే వివరాలను వెల్లడించకుండానే ప్రతిపక్షాల సహకారం కోరడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఎన్నికల మధ్యలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని రాజకీయ లాభం కోసం త్వరితగతిన అమలు చేయాలని చూస్తోందనే అనుమానం బలపడుతోందని ఖర్గే వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణలు కేంద్రం, రాష్ట్రాలపై ప్రభావం చూపే అంశాలని, అందువల్ల అన్ని పార్టీల అభిప్రాయాలు వినడం ప్రజాస్వామ్యంలో అవసరమని ఆయన తెలిపారు. అందుకే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాన్ని సమగ్రంగా చర్చించాలని సూచించారు.

ఏప్రిల్‌ 15న పార్టీలతో కాంగ్రెస్‌ సమావేశం

ఖర్గే లేఖను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్‌లో పంచుకున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఏప్రిల్‌ 29 తర్వాత అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఖర్గే మరోసారి కోరినట్టు తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళా రిజర్వేషన్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆరోపించింది. డీలిమిటేషన్‌ ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా లేదని, దాని వల్ల తీవ్రమైన పరిణామాలు రావచ్చని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 16 నుంచి 18 వరకు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంపై ప్రతిపక్షాల సంయుక్త వ్యూహం ఖరారు చేసేందుకు ఏప్రిల్‌ 15న ప్రతిపక్ష పార్టీల అగ్రనేతల సమావేశం నిర్వహించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే సమయం వచ్చిందని ప్రధాని మోడీ తన లేఖలో పేర్కొన్నారు. 2029 లోక్‌సభ ఎన్నికలు, అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహిళా రిజర్వేషన్ అమలులో ఉన్న నేపథ్యంలో జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చట్టంలో మార్పులకు సంబంధించి అవసరమైన బిల్లులను పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టాలని ఆయన సభ్యులను కోరారు. ఏప్రిల్‌ 16 నుంచి 18 వరకు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశంలో మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు అవసరమైన సవరణలు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను 816కి పెంచడం, అందులో 273 స్థానాలను మహిళలకు కేటాయించడం వంటి ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.