
డీజీపీ కార్యాలయంలో తొలిసారిగా రక్తదాన శిబిరం
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో మొదటిసారిగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ స్వయంగా రక్తదానం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన ఆదర్శాన్ని అనుసరిస్తూ 164 మంది పోలీసు సిబ్బంది రక్తదానంలో పాల్గొన్నారు. వారిలో ఏడీజీపీ (లా & ఆర్డర్) మహేష్ ఎం. భగవత్, ఐజీలు ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఎం. రమేష్, ఇతర ఉన్నతాధికారులు, మంత్రిత్వ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
డీజీపీ మాట్లాడుతూ.. ఒక్క రక్తదానం ద్వారా మూడుగురికి జీవం ప్రసాదించవచ్చు. రక్తం, ప్లాస్మా, ప్లేట్లెట్లు అనేక ప్రాణాలను రక్షిస్తాయి. ప్రతి సంవత్సరం తెలంగాణలో సుమారు 8,000 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. సమయానికి రక్తం అందుబాటులో ఉంటే వారిలో చాలామందిని కాపాడవచ్చు అని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, ప్రజలంతా రక్తదానాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇదే సందర్భంలో, రెండు రోజుల క్రితం హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో 10కిపైగా కేంద్రాల్లో 4,000 యూనిట్లకుపైగా రక్తం సేకరించబడింది. ఇది అత్యవసర సమయాల్లో రక్త నిల్వలకు పెద్ద తోడ్పాటుగా నిలుస్తుందని డీజీపీ తెలిపారు.రక్తదానం సామాజిక బాధ్యత మాత్రమే కాదు, ప్రాణాలను రక్షించే పవిత్ర కర్తవ్యం అని డీజీపీ అన్నారు.
