Let's talk: editor@tmv.in
డీఎస్సీపై అసత్య ప్రచారం.. కఠిన చట్టం తీసుకురావాలి: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

డీఎస్సీపై అసత్య ప్రచారం.. కఠిన చట్టం తీసుకురావాలి: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

Gaddamidi Naveen
29 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తోందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షలపై తప్పుడు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టంలో నిబంధనలు తీసుకురావాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మంగళవారం లోక్‌సభలో 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు-2026'పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. 2018లో జరిగిన గత డీఎస్సీ పరీక్షల్లో తీవ్ర జాప్యం, అక్రమాలు జరిగాయని, 2022 వరకు జవాబు పత్రాల మూల్యాంకనం కూడా సరిగ్గా జరగకపోవడంతో హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేసిందని గుర్తుచేశారు.

పారదర్శకంగా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

2024లో ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో డీఎస్సీని ఎంతో పారదర్శకంగా భారీ స్థాయిలో నిర్వహించారని ఎంపీ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మూలన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో లక్షలాది మంది అభ్యర్థులు రాసిన ఈ పరీక్ష ద్వారా 16,347 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించాయని చెప్పారు. అయితే, వైఎస్సార్సీపీ నేతలు కావాలనే లేనిపోని వ‌దంతులు సృష్టిస్తూ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల్లో, నిరుద్యోగుల్లో గందరగోళం నింపుతున్నారని ఆరోపించారు.

లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పోటీ పరీక్షలపై అసత్యాలు ప్రచారం చేయడం వల్ల పరీక్షల వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని, కాబట్టి పేపర్ లీకేజీలకు పాల్పడే వారితో పాటు వ‌దంతులు రేపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో విజ్ఞప్తి చేశారు.

జాతీయ కోచింగ్ నిబంధనల చట్రం అవసరం

దేశంలో కోచింగ్ సెంటర్ల వ్యాపారం ఏడో తరగతి నుంచే కోచింగ్ కేంద్రాలపై ఆధారపడుతున్నారని, ఈ రంగం విలువ దాదాపు రూ.1 లక్ష కోట్లకు చేరుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థ వ్యాపారీకరణ కాకుండా లాభాపేక్ష లేనిదిగా ఉండాలని, అందుకోసం 'నేషనల్ కోచింగ్ రెగ్యులేషన్ ఫ్రేమ్‌వర్క్' తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, ప్రభుత్వ పరీక్షల్లో అక్రమాలు, వ్యవస్థీకృత మాల్‌ప్రాక్టీసులను అరికట్టేందుకు, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026'పై ప్రస్తుతం లోక్‌సభ వర్షాకాల సమావేశాల్లో చర్చ జరుగుతోంది.

ట్యాగ్‌లు
DSC2026AndhraPradeshAPDSCTDPYSRCPLavuSriKrishnaDevarayaluNaraLokeshTeacherRecruitmentPublicExamsExamReforms
డీఎస్సీపై అసత్య ప్రచారం.. కఠిన చట్టం తీసుకురావాలి: ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు - Tholi Paluku