Let's talk: editor@tmv.in
డీఎంకే పాలనలో ప్రజలు విసిగిపోయారు: శశికళ

డీఎంకే పాలనలో ప్రజలు విసిగిపోయారు: శశికళ

Pinjari Chand
4 ఫిబ్రవరి, 2026

కేంద్ర బడ్జెట్‌ 2026పై బహిష్కృత ఏఐఏడీఎంకే (అమ్మ పెరవై విభాగం) ప్రధాన కార్యదర్శి వి.కె. శశికళ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబ్‌లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం ప్రజలను నిరాశకు గురిచేసిందని ఆమె వ్యాఖ్యానించారు. చెన్నై మరీనా బీచ్‌లో మాజీ ముఖ్యమంత్రి పెరరింజర్ అన్నా స్మారక స్థూపానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం శశికళ మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడు ప్రజలకు ఎవరు ద్రోహులో, ఎవరు నిజమైన ప్రత్యర్థులో స్పష్టంగా తెలుసని అన్నారు. తన ప్రధాన లక్ష్యం పురట్చి తలైవర్ ఎం.జి.ఆర్., పురట్చి తలైవి జయలలిత పాలనా విధానాన్ని తిరిగి తీసుకురావడమేనని శశికళ స్పష్టం చేశారు. పురట్చి తలైవర్, అమ్మ చూపిన మార్గంలోనే తమిళనాడును పాలించడమే నా సంకల్పం అని చెప్పారు. 39 సంవత్సరాల రాజకీయ అనుభవంతో డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలో నుంచి తప్పించేందుకు అవసరమైన ప్రతిదీ చేస్తానని ఆమె ప్రకటించారు.

పురట్చి తలైవర్, పురట్చి తలైవి, నా నిబద్ధ కార్యకర్తలు రాజకీయ రంగంలో నిలబడతారు అని ధీమా వ్యక్తం చేశారు.

ఇంతకు ముందు డీఎంకేపై తీవ్ర విమర్శలు చేసిన శశికళ, తమిళనాడులో కొనసాగుతున్న వంశపారంపర్య పాలన త్వరలో ముగిసి ప్రజల ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. తిరుత్తణి దాడి ఘటన వంటి అనేక నేరాలు డీఎంకే పాలనలో చోటుచేసుకున్నాయని, పోలీసు శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న ముఖ్యమంత్రి ఇప్పటివరకు స్పందించకపోవడం పాలనా వైఫల్యాన్ని సూచిస్తోందని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది చివర్లో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే–కాంగ్రెస్ కూటమి తమ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా, బీజేపీ–ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే ఎదురుదాడికి సిద్ధమవుతోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా పోటీ చేయడంతో ఎన్నికలు ముక్కోణపు పోరుగా మారనున్నాయి.

డీఎంకే పాలనలో ప్రజలు విసిగిపోయారు: శశికళ - Tholi Paluku