
డీఎంకే కూటమి నుంచి టీవీకే అవుట్
తమిళనాడులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే ఆధ్వర్యంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (ఎస్పీఏ)కు చెందిన మిత్రపక్షం తమిళగ వాజ్వురిమై కట్చి (టీవీకే) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, పన్రూటి ఎమ్మెల్యే టి. వేల్మురుగన్ డీఎంకే కూటమి నుంచి నిష్క్రమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎంకే పార్టీ “పెద్ద అన్న” తరహా వైఖరిని అవలంబిస్తోందని, తమ పార్టీని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ వెల్మురుగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మీడియాతో మాట్లాడిన ఆయన, సీట్ల పంపకాల్లో తమ పార్టీకి ఒక్క సీటు మాత్రమే ఇస్తామని ముందే చెప్పారని గుర్తుచేశారు. అయితే, తాము సామాజిక న్యాయం సహా పలు అంశాలపై డిమాండ్లు ఉంచినప్పుడు వాటిని గౌరవించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీలెవ్వరూ డిమాండ్లు చేయడం లేదు, మీరు ఎందుకు చేస్తున్నారనే విధంగా మాతో మాట్లాడారు. ఇది మాకు అన్యాయంగా అనిపించిందని ఆయన అన్నారు.
తమ డిమాండ్లను ప్రభుత్వం కనీసం కొంతైనా అమలు చేయాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని వేల్మురుగన్ ఆరోపించారు. శాసనసభలో కూడా ఇదే విషయాన్ని సంవత్సరాలుగా ప్రస్తావిస్తున్నానని, అయినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.
సీట్ల చర్చల సమయంలో డీఎంకే ఎన్నికల కమిటీ ప్రవర్తన “పెద్ద అన్న”లా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎండీఎంకే వంటి పెద్ద మిత్రపక్షాలు కూడా డిమాండ్లు పెట్టకపోతే, చిన్న పార్టీ అయిన మీకు అర్హత లేదనే భావనతో మాతో వ్యవహరించారని అన్నారు. ఇలాంటి వైఖరి అసలు ఆమోదయోగ్యం కాదు అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, కొంతమంది అధికారులు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రులకు తనపై తప్పుగా ఫిర్యాదులు చేస్తున్నారని కూడా వేల్మురుగన్ ఆరోపించారు. తాను ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తున్నానని చెబుతున్నారని పేర్కొన్నారు.
సామాజిక న్యాయం విషయంలో డీఎంకే ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నించారు. ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలు కులగణన నిర్వహించినప్పుడు, తమిళనాడు ప్రభుత్వం ఎందుకు అదే మార్గాన్ని అనుసరించలేదని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే డీఎంకే, దానికి వ్యతిరేక శక్తులతో కలిసి ఎలా ముందుకు సాగుతుంది? అని విమర్శించారు.
గత ఐదేళ్లుగా తాము డీఎంకే కూటమిలో ఉన్నామని, 2021 ఎన్నికల్లో డీఎంకే ‘రైజింగ్ సన్’ గుర్తుపై పోటీ చేసి గెలిచామని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో సహకరించిన ముఖ్యమంత్రి స్టాలిన్తో పాటు మిత్రపక్షాలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే, పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ, జనరల్ కౌన్సిల్, రాజకీయ నాయకత్వ కమిటీ కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకపై తమ పార్టీ ఎలాంటి దిశలో సాగుతుందో త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే, తమిళనాడులో ఎన్డీయే కూటమిలో చేరబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కొన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు సంకేతం ఇచ్చారు.
ఇదిలా ఉండగా, టీవీకే పార్టీ బయటకు రావడంపై డీఎంకే జనరల్ సెక్రటరీ, రాష్ట్ర మంత్రి దురై మురుగన్ వ్యంగ్యంగా స్పందించారు. ఏ పార్టీ అయినా కూటమి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇది చాలా మంచి ప్రభుత్వం, అందుకే వెళ్తున్నాం అని చెబుతారా? కచ్చితంగా ఏదో ఒక తప్పు ఎత్తిచూపే వెళ్తారు. ఇది రాజకీయాల్లో అలవాటుగా జరిగేదే అని కొట్టిపారేశారు. వేల్మురుగన్తో మళ్ళీ చర్చలు జరిపే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు, చర్చలు నా పరిధిలోని అంశం కాదు అని సమాధానమిచ్చారు.
ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల వేళ, ఒక వెనుకబడిన వర్గాల మద్దతు ఉన్న పార్టీ కూటమిని వీడటం డీఎంకేకు కొంత నష్టం కలిగించే అంశమే. ముఖ్యంగా కడలూరు వంటి జిల్లాల్లో వేల్మురుగన్ ప్రభావం సీట్ల ఫలితాలను మార్చే అవకాశం ఉంది. డీఎంకే తన 'సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్'లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్తుండగా, చిన్న పార్టీలు ఇలా దూరమవ్వడం ఆసక్తికరంగా మారింది.
ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఎన్నికల ముందు కూటముల మార్పులు, పార్టీల మధ్య తగాదాలు ఓటర్లపై ఎంత ప్రభావం చూపిస్తాయో చూడాలి.
