
డీఎంకేతోనే మా పోటీ: విజయ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు నాలుగు పక్షాల పోటీ కాదని, అసలు పోటీ టీవీకే, అధికార డీఎంకే మధ్యేనని నటుడు–రాజకీయ నాయకుడు విజయ్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న 234 స్థానాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కన్యాకుమారిలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఇది 4-వైపు పోటీ కాదు, 40-వైపు పోటీ కూడా కాదు. ఇక్కడ రెండు వైపులే ఉన్నాయి. టీవీకే, డీఎంకే అని ఆయన వ్యాఖ్యానించారు. భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, కార్యకర్తల మధ్య విజయ్ సైకిల్ రైడ్ చేయడం ఆకర్షణగా నిలిచింది. ఇదే తరహా ప్రచారంలో ఆయన గతంలో కరైకుడిలో కూడా సైకిల్ రైడ్ చేశారు.
ఏఐ ప్రభుత్వం.. హామీలు
విజయ్ తన ప్రసంగంలో సాంకేతికత ఆధారిత పాలనపై దృష్టి సారించారు. దేశంలో తొలి కృత్రిమ మేధస్సు (ఏఐ) మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని, ‘ఏఐ సిటీ’, ప్రత్యేక ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి కుటుంబానికి తమిళనాడు సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వ పథకాలు మధ్యవర్తులు లేకుండా అందుతాయని హామీ ఇచ్చారు. అలాగే ఆరు నెలల్లో రైట్ టు సర్వీస్ యాక్ట్ తీసుకొస్తామని చెప్పారు. వెట్రి తమిళనాడు పేరుతో ఒక సూపర్ యాప్ ద్వారా అన్ని ప్రభుత్వ సేవలను డిజిటల్గా అందిస్తామని కూడా తెలిపారు.
ప్రభుత్వంపై విమర్శలు
తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై విమర్శలు చేసిన ఆయన, రాష్ట్ర అప్పు రూ.10.5 లక్షల కోట్లకు చేరిందని ఆరోపించారు. గత ఐదేళ్లలోనే అధిక అప్పు తీసుకున్నారని కూడా అన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి, లంచాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ, దీనిని అవినీతి పాలనగా పేర్కొన్నారు. 5 లక్షల ధృవీకరించిన సంతకాలతో వచ్చిన ప్రజా పిటిషన్లను అసెంబ్లీలో తప్పనిసరిగా చర్చించాల్సిన పీపుల్స్ ఫోరం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
ప్రచారంలో గందరగోళం
విజయ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్పై ఇటీవల గందరగోళం నెలకొంది. కొన్ని సభలు రద్దయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్. ఆనంద్ కన్యాకుమారి సభ కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ జనసమూహం కారణంగా భద్రత సమస్యలు తలెత్తిన నేపథ్యంలో అభిమానులు వాహనాలను అనుసరించకుండా వర్చువల్గా పాల్గొనాలని పార్టీ సూచించింది.
