Let's talk: editor@tmv.in
డిల్లీ ఆంధ్ర భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్యవేత్తలకు ఏపీకి రావాలని ఆహ్వానం

డిల్లీ ఆంధ్ర భవన్‌లో భోజనం చేసిన జపాన్ దౌత్యవేత్తలకు ఏపీకి రావాలని ఆహ్వానం

Dantu Vijaya Lakshmi Prasanna
22 జనవరి, 2026

న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ క్యాంటీన్‌లో భోజనాన్ని ఆస్వాదించిన భారతదేశంలోని జపాన్ రాయబార కార్యాలయ దౌత్యవేత్తలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు. రాష్ట్రంలో వారికి ఇంకా ఎన్నో అద్భుతమైన అనుభవాలు వేచి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

మంగళవారం జపాన్ దౌత్యవేత్తలు బృందంగా ఆంధ్ర భవన్‌ను సందర్శించి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ అనుభవాన్ని వారు ఎక్స్ వేదికగా పంచుకుంటూ.. "మేమంతా కలిసి రుచికరమైన, అసలైన ఆంధ్ర థాలీని ఆస్వాదించాం. ఇది గాఢమైన రుచులతో, కారంగా చాలా బాగుంది" అని పోస్ట్ చేశారు.

దౌత్యవేత్తల పోస్ట్‌పై స్పందిస్తూ ముఖ్యమంత్రి, "మా ఆంధ్ర భవన్‌లో మీరు మా సంప్రదాయ భోజనాన్ని ఆస్వాదించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు నా అభినందనలు. జపాన్ నుండి వచ్చే అతిథులందరికీ మా రాష్ట్రంలో ఇంకా ఎంతో ఆత్మీయత వేచి ఉంది. మీరెండో ఇల్లైన ఆంధ్రప్రదేశ్‌కు మిమ్మల్ని ఆహ్వానించేందుకు మేము ఎదురుచూస్తున్నాం" అని రాశారు.

జపాన్ వంటకాలైన సుషీ, సాషిమీలు ఎంత కచ్చితత్వంతో ఉంటాయో, ఆంధ్ర వంటకాలు కూడా అదే రీతిలో ఇక్కడి ప్రజల ఆత్మీయతను, ఉదారతను ప్రతిబింబిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.

భారత దేశంలోని జపాన్ రాయబారి ఓనో కెయిచి ఒక అడుగు ముందుకు వేసి, తన భారతీయ మిత్రులను అనుసరిస్తూ బిర్యానీని చేత్తో తిన్నారు. "బిర్యానీని చేత్తో తినడానికి ప్రయత్నించాను. సుషీ లాగే, బిర్యానీ కూడా చేత్తో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. దీనివల్ల నా స్నేహితులకు నేను మరింత దగ్గరైనట్లు అనిపిస్తోంది" అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.