Let's talk: editor@tmv.in
డబ్బు చెల్లించలేదని వ్యాపారి దౌర్జన్యం

డబ్బు చెల్లించలేదని వ్యాపారి దౌర్జన్యం

Panthagani Anusha
20 అక్టోబర్, 2025

ఇటీవలి కాలంలో డిజిటల్‌ చెల్లింపులు (ఫోన్‌పే, గూగుల్‌పే వంటి యాప్‌లు) విస్తృతంగా వాడుతున్న తరుణంలో, చెల్లింపుల్లో వచ్చే సాంకేతిక లోపాలు కొన్ని కొన్ని సార్లు అనుకోని పరిణామాలకు దారి తీస్తాయి .అందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. సమోసాలు కొనడానికి ప్రయత్నించిన ఓ ప్రయాణికుడి నుంచి వ్యాపారి ఆన్‌లైన్‌ లావాదేవీ విఫలమైనందున చేతి గడియారాన్నే చెల్లింపుగా తీసుకున్నాడు.

ఈ ఘటన శుక్రవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ప్లాట్‌ఫాం నం.5 వద్ద చోటుచేసుకుంది. ఒక ప్రయాణికుడు సమోసాలు కొనుగోలు చేసిన తరువాత యూపీఐ ద్వారా డబ్బు చెల్లించేందుకు ప్రయత్నించాడు. అయితే సాంకేతిక లోపాలవల్ల పేమెంట్ పూర్తికాలేదు ఈ క్రమంలో ట్రైన్‌ కదలడం ప్రారంభమయ్యేసరికి సదరు ప్రయాణికుడు ప్రయాణికుడు సమోసాలు తీసుకోకుండా వెళ్ళిపోవడానికి ప్రయత్నించగా, సమోసా వ్యాపారి అతన్ని ఆపి గొడవ పడ్డాడు. నువ్వు అలాగైనా డబ్బు చెల్లించి సమోసాలు తీసుకోవాల్సిందే అని ప్రయాణికుడి చొక్కా కాలర్ పట్టుకుని దౌర్జన్యం చేసాడు. ఒకవైపు ట్రైన్ వెళ్లి పోతుండడంతో ఏమి చేసింది లేక ఆ ప్రయాణికుడు చివరికి తన చేతి గడియారాన్ని తీసి ఇవ్వగా, వ్యాపారి రెండు సమోసాలు ఇచ్చాడు అతన్ని వదిలేసాడు.

కాగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఈ వీడియో కాస్త రైల్వే అధికారులు కంటపడంతో వారు వెంటనే స్పందించి. రైల్వే రక్షణ దళం ఆ వ్యాపారిని గుర్తించి శనివారం అదుపులోకి తీసుకొని విచారించగా ఆ వ్యాపారి తన తప్పు ఒప్పుకుని ఆన్‌లైన్‌ చెల్లింపు విఫలమైన కారణంగా కోపంతో అలా ప్రవర్తించానని చెప్పాడు. అనంతరం ఆ ప్రయాణికుడి గడియారాన్ని తిరిగి ఇచ్చినట్లు సమాచారం.

ఈ ఘటనపై జబల్‌పూర్‌ రైల్వే విభాగ అధికారి స్పందిస్తూ ప్రస్తుతం ఆ వ్యాపారి తమ కస్టడీ లోనే ఉన్నాడని అతనికి సంబంధించిన వ్యాపార లైసెన్స్ రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ మరింత కఠినతరం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

డబ్బు చెల్లించలేదని వ్యాపారి దౌర్జన్యం - Tholi Paluku