
డిప్యూటీ సీఎం ఎక్స్ అకౌంట్ హ్యాక్
సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడు, సీఎం అనే తేడా లేకుండా విజృంభిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయింది. దీంతో ఆయనను ‘ఎక్స్’లో అనుసరించే వారంతా ఆదివారం ఒక్కసారిగా షాకయ్యారు. ఆయన ఖాతాలో టర్కీ, పాకిస్థాన్ జెండాలతో హ్యాకర్లు ఓ పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆశ్యర్యపోయారు. కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురయ్యారు. వేరే దేశాలకు చెందిన జెండాలు చూసి నివ్వెరపోయారు. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యింది. ఆయన అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు.
రంగంలోకి టెక్నికల్ టీం
ఈ సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ సీఎం టెక్నికల్ టీం రంగంలోకి దిగింది. ఆయన ఖాతాలో టర్కీ, పాకిస్థాన్ కు చెందిన జెండాల పోస్ట్ లను తొలగించింది. దీంతో పరిస్థితి సద్దుమణిగింది. తిరిగి ఆయన ఖాతాను హ్యాకర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇక ముందు హ్యాక్ కాకుండా సురక్షితమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ప్రజలు అవగాహన పెంచుకోవాలి
నానాటికీ పెరుగుతున్న డిజిటల్ దారుణలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని అధికారులు ప్రజలకు సూచించారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా సోషల్ మీడియా అకౌంట్లకు దృఢమైన పాస్ వర్డ్, టూ స్టెప్ వెరిఫికేషన్ వంటి భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
