Let's talk: editor@tmv.in
డచ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్: షైనా మణిమత్తుకు కాంస్యం

డచ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్: షైనా మణిమత్తుకు కాంస్యం

Shaik Mohammad Shaffee
2 మార్చి, 2026

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై భారత్‌కు చెందిన వర్ధమాన క్రీడాకారిణి షైనా మణిముత్తు మెరిసింది. ప్రతిష్ఠాత్మక 'డచ్‌ జూనియర్‌ ఇంటర్నేషనల్‌' టోర్నీలో ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన బాలికల సింగిల్స్‌ సెమీఫైనల్లో షైనా 17-21, 8-21తో చైనాకు చెందిన యీ క్వింగ్‌ ఇన్‌ చేతిలో పరాజయం పాలైంది. సుమారు 35 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో చైనా షట్లర్‌ ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించడంతో షైనా పోరాటం సెమీస్‌తోనే ముగిసింది. అయితే ఈ టోర్నీలో సెమీస్‌ వరకు చేరడం ద్వారా ఆమె కాంస్య పతకాన్ని ఖరారు చేసుకుంది.

గతంలో ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-15 విభాగంలో విజేతగా నిలిచిన షైనా, ఈ టోర్నీలోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేసింది. సెమీఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఆమె మూడో సీడ్‌, 13వ సీడ్‌ క్రీడాకారిణులపై అద్భుత విజయాలను నమోదు చేసింది. అంతర్జాతీయ వేదికలపై అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించడం ద్వారా షైనా తనలోని ప్రతిభను, నిలకడను మరోసారి చాటిచెప్పింది. భవిష్యత్తులో భారత బ్యాడ్మింటన్‌ రంగంలో ఆమె కీలక క్రీడాకారిణిగా ఎదుగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.