Let's talk: editor@tmv.in
ట్రైనీ ఐపీఎస్ పిటిషన్‌పై విచారణ జూలై 27కు వాయిదా వేసిన హైకోర్టు

ట్రైనీ ఐపీఎస్ పిటిషన్‌పై విచారణ జూలై 27కు వాయిదా వేసిన హైకోర్టు

Gaddamidi Naveen
23 జులై, 2026

తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను తెలంగాణ హైకోర్టు జూలై 27కి వాయిదా వేసింది.

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి మహిళా ట్రైనీని లైంగికంగా వేధించడంతో పాటు వేధింపులకు గురిచేశాడనే ఆరోపణలపై జూలై 18న ఈ 32 ఏళ్ల ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డిపై కేసు నమోదైంది. ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు రాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినాలని కోరారు. అయితే, దీనిపై పూర్తి వివరాలు తీసుకోవడానికి ప్రభుత్వ ప్రాసిక్యూటర్ సమయం కోరడంతో న్యాయస్థానం విచారణను జూలై 27కి వాయిదా వేసింది.

బాధిత 30 ఏళ్ల మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. జూన్ 23 నుంచి సదరు అధికారి ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా తనను లైంగికంగా వేధిస్తూ అసభ్యకర సందేశాలు పంపుతున్నారని, అకాడమీలో స్నేహితుల ముందే తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మరో ట్రైనీతో తనకు శారీరక సంబంధం ఉందంటూ నిందలు మోపాడని, ఆ సంబంధాన్ని అంగీకరించాలని తనపై ఒత్తిడి తెస్తూ దుర్భాషలాడాడని పేర్కొన్నారు. జూలై 9న తనను అడ్డుకుని, బలవంతంగా ఆయన గదిలోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని గొంతు నులిమేందుకు ప్రయత్నించాడని, మెడపై కత్తి ఉంచి గది నుంచి బయటకు వెళ్లకుండా నిరోధించాడని ఫిర్యాదులో వెల్లడించారు.

అంతేకాకుండా, తన ప్రమేయం లేదా అనుమతి లేకుండా తన వ్యక్తిగత వీడియోను చిత్రీకరించి, తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ఆ వీడియోను తన భర్తకు పంపాడని బాధితురాలు ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా, అత్తాపూర్ పోలీసులు మహిళపై క్రిమినల్ బలప్రయోగం, లైంగిక వేధింపులు, వేధించడం, మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలతో పాటు సమాచార సాంకేతిక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు, నిందితుడైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఒక ఫ్లాట్‌లో స్పృహతప్పి పడివుండగా ఆయన సోదరుడు, స్నేహితులు గుర్తించి జూలై 20న ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఏదైనా హానికర పదార్థం తాగివుంటాడని అనుమానించారు. అయితే, ఆయనకు గ్యాస్ట్రిక్ లావేజ్ నిర్వహించిన తర్వాత ఎలాంటి అసాధారణ పరిస్థితులు కనిపించలేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని చికిత్స అందించిన వైద్యుడు తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి గతంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించినట్లు సమాచారం.