Let's talk: editor@tmv.in
ట్రంప్ మధ్యవర్తిత్వంతో థాయ్‌లాండ్–కాంబోడియా శాంతి ఒప్పందం

ట్రంప్ మధ్యవర్తిత్వంతో థాయ్‌లాండ్–కాంబోడియా శాంతి ఒప్పందం

Yekkirala Akshitha
27 అక్టోబర్, 2025

జూలైలో జరిగిన ఘోరమైన సరిహద్దు ఘర్షణల తర్వాత థాయ్‌లాండ్ ,కాంబోడియా దేశాలు శాంతిని బలపర్చేందుకు విస్తృత కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఘర్షణలు ప్రెహా విహేర్ ప్రాంతంలోని యునెస్కో వారసత్వ జాబితాలో ఉన్న పురాతన ఆలయ సమీపంలో ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంపై వివాదం 1900ల ప్రారంభంలో జరిగిన ఫ్రాంకో–సయామీస్ ఒప్పందాలలోని అస్పష్ట సరిహద్దు గీతల వల్ల ఇప్పటికీ కొనసాగుతోంది.

జూలైలో జరిగిన ఐదు రోజుల యుద్ధంలో పెద్ద మొత్తం సంఖ్యలో మరణాలు, మూడు లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనను రేపింది.

ట్రంప్ మధ్యవర్తిత్వంతో తొలి కాల్పుల విరమణ

జూలైలో సంతకం చేసిన మొదటి కాల్పుల విరమణ ఒప్పందం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో సాధ్యమైంది. ట్రంప్ తన ప్రభావాన్ని ఉపయోగించి, థాయ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ ,కాంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్ లతో నేరుగా ఫోన్ సంభాషణలు జరిపి ఉద్రిక్తత తగ్గించేందుకు ప్రోత్సహించారు.

ఆ ఒప్పంద సంతక వేడుకకు ట్రంప్ హాజరై, దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, స్థిరత్వం అవసరాన్ని నొక్కి చెప్పారు.

కౌలాలంపూర్‌లో విస్తృత ఒప్పందంపై సంతకం

తాజాగా కౌలాలంపూర్‌లో జరిగిన ఆసియన్ శిఖరాగ్ర సమావేశంలో రెండు దేశాలు కొత్తగా విస్తృత ఒప్పందంపై సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందంలో ముఖ్యాంశాలు:

• సరిహద్దు ప్రాంతం నుంచి భారీ ఆయుధాలను తొలగించడం

• జూలై ఘర్షణల్లో పట్టుబడ్డ 18 మంది కాంబోడియా సైనికులను విడుదల చేయడం,

• ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు ఆసియన్ పరిశీలకులను నియమించడం.

ఈ ఒప్పందం, దశాబ్దాలుగా కొనసాగుతున్న అవిశ్వాసం ,ఉద్రిక్తతలను తగ్గించేందుకు కీలక అడుగుగా భావిస్తున్నారు.

రెండు దేశాల ప్రధాన మంత్రుల స్పందనలు

థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చార్న్‌విరాకుల్ మాట్లాడుతూ

“జూలై కాల్పుల విరమణ తర్వాత మేము చాలా దూరం వచ్చాం. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య శాశ్వత శాంతికి పునాది వేస్తుంది అని అన్నారు.

కాంబోడియా ప్రధాన మంత్రి హున్ మానెట్ స్పందిస్తూ ఈ ఒప్పందం ప్రాంతీయ స్థిరత్వాన్ని బలపరుస్తుందని పేర్కొన్నారు.

థాయ్‌లాండ్‌లో నాయకత్వ మార్పు తరువాత

ఈ ఒప్పందం, థాయ్‌లాండ్‌లో జరిగిన నాయకత్వ మార్పు తర్వాత వచ్చింది. మాజీ ప్రధాన మంత్రి పాయ్తోంగ్తాన్ షినావత్రా పదవి నుంచి వెళ్లిపోయిన కొత్తగా బాధ్యతలు చేపట్టిన అనుతిన్ చార్న్‌విరాకుల్, దేశీయ ఐక్యత ,దౌత్య సంబంధాల మెరుగుదలపై దృష్టి పెట్టారు. ఆయన ఈ శాంతి చర్చల్లో చురుకైన పాత్ర పోషించడం, తన నాయకత్వ శైలిని ప్రతిబింబిస్తుంది.

ట్రంప్ పాత్రకు విశేష ప్రాధాన్యం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఫోన్ కాల్స్, వాణిజ్య ఆంక్షల హెచ్చరికలు రెండు దేశాలను చర్చల బాట పట్టేలా చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.