Let's talk: editor@tmv.in
ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోయారు: సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

ట్రంప్ ఒత్తిడికి మోదీ లొంగిపోయారు: సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా

Gaddamidi Naveen
19 జనవరి, 2026

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ప్రధాన కార్యదర్శి డి. రాజా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి లోబడి దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ఖమ్మంలో నిర్వహించిన సీపీఐ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడిన రాజా, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, అమెరికా విధించే అధిక సుంకాల అంశాల్లో ట్రంప్ ఆదేశాలను మోదీ ప్రభుత్వం ప్రశ్నించకుండా అనుసరిస్తోందని అన్నారు.

భారతదేశం ఒకప్పుడు ప్రపంచ శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉన్న గౌరవనీయ దేశంగా గుర్తింపు పొందిందని రాజా పేర్కొన్నారు. అయితే మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ అంతర్జాతీయ గౌరవం దెబ్బతిందని ఆయన విమర్శించారు. ట్రంప్ భారత్‌ను రష్యా నుంచి చమురు కొనవద్దని హెచ్చరిస్తున్నా, అమెరికా ప్రతిపాదించిన సుంకాలను అంగీకరించమని ఒత్తిడి చేస్తున్నా, మోదీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ప్రశ్నించటం లేదు, ఖండించటం లేదు. ఇది అమెరికన్ సామ్రాజ్యవాద శక్తికి లొంగిపోవడమే అని రాజా అన్నారు.

ఇలాగే అమెరికా ఒత్తిడికి లోబడితే, మోదీకి దేశ ప్రధాని గా కొనసాగేందుకు నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై కూడా రాజా ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దాడులను ఆయన “జనోసైడ్”గా అభివర్ణించారు.

అలాగే, భారత స్వాతంత్య్రం పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలే ముందుండి పోరాడాయని, ఆర్ఎస్ఎస్, బీజేపీలకు ఆ ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేదని రాజా ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ నేతలను కలిస్తే, స్వాతంత్య్రం ఉద్యమంలో వారు ఏం చేశారో అడగండి. వారు ఏ పాత్ర కూడా పోషించలేదు. బ్రిటిష్ పాలకులతో సహకరించారు అని ఆయన అన్నారు.

డొనాల్డ్ ట్రంప్ విదేశాంగ విధానాన్ని కూడా రాజా తీవ్రంగా తప్పుబట్టారు. ట్రంప్ వెనిజులాపై యుద్ధం ప్రారంభించారని, అక్కడి ఎన్నికైన అధ్యక్షుడు ఆయన భార్యను అదుపులో పెట్టుకున్నారని, అలాగే మెక్సికో, కొలంబియా, క్యూబా, ఇరాన్ వంటి దేశాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విధానాలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతున్నాయని రాజా హెచ్చరించారు.

కాంగ్రెస్ - కమ్యూనిస్టుల ఐక్యతకు సీఎం పిలుపు

ఈ శత వసంతాల వేడుకల్లో పాల్గొనడం ఒక అరుదైన, చారిత్రాత్మక సందర్భం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం, దేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్–కమ్యూనిస్టుల మైత్రి సంచలనాత్మక రాజకీయ ఫలితాలతో పాటు, ప్రజల పక్షాన కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకోవడంలోనూ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. స్వాతంత్య్రం ఉద్యమం నుంచి సంక్షేమ రాష్ట్ర నిర్మాణం వరకు అనేక సందర్భాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేశాయని సీఎం తెలిపారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న రాజకీయ, ఆర్థిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుంటే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మళ్లీ ఐక్య పోరాటం అవసరం అని సీఎం పిలుపునిచ్చారు.

దేశంలో ఎన్నికల ఓటర్ల జాబితాల సింగిల్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ (స‌ర్) అమలు అనేది రాజ్యాంగాన్ని సవరించేందుకు బీజేపీ కుట్రలో భాగమని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని శాశ్వతంగా అధికారంలో కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నట్లు విమర్శించారు. ఆయన స‌ర్ అమలును దారుణమైన విధంగా పేదల ఓటర్లను తొలగించే ప్రయత్నంగా పేర్కొన్నారు.

కాంగ్రెస్, కమ్యూనిస్టులు లేదా ఇతర ఏ పార్టీ అయినా, ప్రజాస్వామ్యం కొనసాగాలని కోరుకునేవారు ఐక్యంగా పోరాడాలి. భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం పేదల ఓటింగ్ హక్కులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ లోక్‌సభలో 400 సీట్లు గెలుస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందని. బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే సాధించింది. ఇప్పుడు పరోక్షంగా, రాజ్యాంగ సవరణకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే స‌ర్ అమలు జరుగుతోందని సీఎం పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి దేశంలో పేదలకు ఓటింగ్ హక్కులు నిర్ధారించిన దాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ నాయకత్వాన్ని గుర్తుచేశారు. ఇప్పడు స‌ర్ ద్వారా పేదల ఓటింగ్ హక్కులను అరికట్టడానికి కుట్రలు చేస్తున్నారు. దేశంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు.

ముఖ్యంగా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కంపెనీలను బలపరిచేందుకు తగ్గించబడింది, దీని వల్ల పేదలు ఉద్యోగార్థం నగరాలకు వెళ్లాల్సి వస్తోందని ఆయ‌న తెలిపారు.పేదల హక్కులను రక్షించేందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలుపుకునేందుకు, ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేపట్టాలన్ని సూచించారు.

కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని, ప్రజా సమస్యలకు పరిష్కారాలు చూపలేని పాలన కొనసాగుతోందని సీఎం విమర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు శక్తులు ఇతర లౌకిక, ప్రజాస్వామ్య వాదులతో కలిసి పోరాడితేనే మార్పు సాధ్యమని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.