
టీ20 విశ్వవిజేత భారత్కు రూ.25 కోట్ల ప్రైజ్మనీ
స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్లో తిరుగులేని విజేతగా నిలిచిన టీమిండియాపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కాసుల వర్షం కురిపించింది. ఈ మెగా టోర్నీ కోసం కేటాయించిన రికార్డు స్థాయి 1.12 కోట్ల డాలర్ల (సుమారు రూ.100 కోట్లు) ప్రైజ్ మనీ పూల్ నుంచి భారత్కు సింహభాగం దక్కింది. ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి టైటిల్ నెగ్గిన భారత్, సుమారు రూ.25 కోట్ల (26,39,423 డాలర్లు) నగదు బహుమతిని సొంతం చేసుకుంది. ఆటగాళ్లకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 2024 నుంచి ఐసీసీ ఈ భారీ నగదు బహుమతులను అమలు చేస్తోంది.
రన్నరప్, సెమీఫైనలిస్టులకు భారీ మొత్తం
ఫైనల్లో భారత్ చేతిలో ఓడి రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు సుమారు రూ.13 కోట్లు గెలుచుకుంది. ఇక సెమీఫైనల్ వరకు చేరిన దక్షిణాఫ్రికాకు రూ.9.24 కోట్లు, ఇంగ్లండ్కు రూ.8.96 కోట్లు లభించాయి. ఇతర జట్లలో వెస్టిండీస్కు సుమారు రూ.4.9 కోట్లు, శ్రీలంక వేదికగా మ్యాచ్లు ఆడిన పాకిస్థాన్ జట్టుకు రూ.4.8 కోట్లు అందాయి. టోర్నీలో తమ ప్రదర్శన ఆధారంగా జింబాబ్వేకు సుమారు రూ.4.5 కోట్లు, శ్రీలంకకు రూ.4.3 కోట్లను ఐసీసీ కేటాయించింది.
చివరి వరకు పోరాడిన జట్లకూ వాటా
సూపర్-8 దశలోనే వెనుదిరిగిన ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, అమెరికా జట్లకు ఒక్కొక్కరికి రూ.2.84 కోట్లు లభించాయి. తర్వాతి స్థానాల్లో ఉన్న స్కాట్లాండ్కు రూ.2.56 కోట్లు, ఐర్లాండ్కు రూ.2.49 కోట్లు అందాయి. టోర్నీలో పాల్గొన్న ఇటలీ, నెదర్లాండ్స్, యూఏఈ, నేపాల్ జట్లకు చెరో రూ.2.35 కోట్లు దక్కగా, చివరగా కెనడా, నమీబియా, ఒమన్ జట్లు ఒక్కొక్కటి రూ.2.06 కోట్లు నగదును అందుకున్నాయి. ఆటగాళ్లకు తగిన ఆర్థిక ప్రోత్సాహం అందించడం ద్వారా క్రికెట్ ఆడుతున్న అన్ని దేశాలలో క్రీడాభివృద్ధిని బలోపేతం చేయడమే ఐసీసీ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా నిర్వాహకులు వెల్లడించారు.
